సంపూర్ణ మహాభారతము*-సరళ వ్యావహారిక భాషలో...!

 సభా పర్వము ద్వితీయాశ్వాసము:- *66 వ రోజు
పాండవులు భీష్ముడు, ద్రోణుడు, కృపాచార్యుల వద్ద శలవు తీసుకున్నారు. కుంతీ దేవి వద్దకు వచ్చారు. ఆమె " పుత్రులారా! ఇలాంటి దుస్థితి వస్తుందని ముందుగా ఊహించి మీ తండ్రి, మాద్రి స్వర్గానికి వెళ్ళారు. నేను దురదృష్టవంతు రాలిని కృష్ణా ! నా కుమారులను కాపాడు " అని ప్రార్థించింది. కొడుకులను కోడలిని దీవించి పంపింది. అందరూ అడవికి పయనమయ్యారు. దుశ్శాసనుడు "ద్రౌపదీ! ఈ పాండవులు అరణ్యంలో తిరుగుతుంటే నీకు ప్రీతి ఎలా కలుగుతుంది. కౌరవులు ధన సంపన్నులు వీరిలో ఎవరినైనా నీ కిష్టమైన వానిని వరించు" అని పాండవులు వినేతట్లు అన్నాడు. "నీవు శకుని మాయా ప్రభావంతో గెలుచుకున్న రాజ్య మదంతో మమ్ములను బాధిస్తున్నావు. యుద్ధంలో నీ మర్మస్థానాలను బ్రద్దలు చేస్తూ ఈ నీ మాటలను గుర్తుచేస్తాను" అని భీముడు మాటాడుతుంటే దుశ్శాసనుడు "ఎద్దు, ఎద్దు" అని పరిహసిస్తూ కౌరవుల మధ్యలో వుండి నృత్యం చేయసాగాడు. ధర్మరాజు భీమసేనుని నిరోధిస్తున్న భీముడు ఆగక "ఈ వ్రుకోధరుడు యుద్దంలో నీ గుండెలు చీల్చి నీ నెత్తురు త్రాగక పోతే పుణ్యలోకాలను పొందలేడు. అంతే గాదు దుశ్శాసనా! అందరు చూస్తుండగా ధార్తరాష్ట్రులందరినీ చంపి శాంతిని పొందుతాను" అని ప్రతిజ్ఞ చేసాడు. అయినా దుర్యోధనుడు ఆనందపరవశుడై భీముడి గమనాన్ని ఎగతాళిగా అనుకరిస్తూ హేళనచేసాడు. "మూర్ఖుడా! దుర్యోధనా! కౌరవపాండవుల మధ్య యుద్ధం జరిగినప్పుడు దుశ్శాసనుడి నెత్తురు త్రాగాడమే కాదు, నిన్ను సభాన్ధవంగా యమలోకాని పంపి, నీవు చేస్తున్న హేళనను గుర్తుచేస్తా. రణభుమిలో నిన్ను గదతో చంపి నేలపై పడత్రోసి నీ తలను కాలితో తన్ని నిలబడుతా. అర్జునుడు కర్ణుని చంపుతాడు. జూదరి శకునుని సహదేవుడు చంపుతాడు" అని భయకర ప్రతిజ్ఞ జేయగా అర్జునుడు "భీమా! సజ్జనులు తాము చేయదలచుకున్నది మాటలతో చెప్పరు. నేటికి పదునాల్గవ సంవత్సరంలో దుర్యోధనుడు మన రాజ్యంను మనకు ఇవ్వకుంటే నీవు చెప్పినట్లు నేను కర్ణుడిని, మతిచెడి మరెవారైన సరే నాకెదురు నిల్చి యుద్ధం చేస్తే వారందరిని యమపురికి పంపుతాను" అని ప్రతిజ్ఞ చేసాడు. సహదేవుడు "గాన్దారుల కీర్తిని నాశనం చేసిన ఓ శకునీ! ఇవి పాచికలను కుంటున్నావు. ఈ రూపంలో వున్న తీవ్ర బాణాలివి. యుద్దధర్మాన్ని అనుసరించి నీవు రణరంగంలో నిలిస్తే నీ బాంధవులతో సహా నిన్ను సంహరిస్తా! అని ప్రతిజ్ఞ చేసి పాండవులు  కోపం నిండిన చూపులకు జనం దహించబడతారని ధర్మరాజు ముఖానికి వస్త్రం అడ్డం పెట్టుకుని వెళ్ళాడు, ఎట్టకేలకు యుద్ధంలో బాహు బలం ప్రదర్శించే అవకాశం వచ్చిందని భీముడు రొమ్ము విరుచుకుంటూ వెళ్ళాడు. ఇంత కంటే ఎక్కువగా అస్త్ర సంధానం చేసి శత్రు సంహారం చేస్తానని అర్జునుడు చేతితో ఇసుక చల్లుకుంటూ వెళ్ళాడు. తమ అందచందాలు చూసి జనులు దు॰ఖిస్తారని నకులసహదేవులు మలిన వస్త్రాలతో వెళ్ళారు. తడిసిన బట్టలతో విడిన కురులతో దుఃఖిస్తూ యుద్ధంలో భర్తలను పోగొట్టుకున్న కౌరవుల భార్యలు ఇలా రాజ్యం వదిలి వెళతారని సూచిస్తూ ద్రౌపది వెళ్ళింది. పాండవులతో ధౌమ్యుడు, వేలాది బ్రాహ్మణులు పాండవులను అనుసరించారు. ఇలా పాండవులు అడవులకు వెళ్లారు. రాముడు అరణ్యవాసంకు వెళ్ళినపుడు అయోధ్యా వాసులు ఎలా దుఃఖించారో అలా హస్తినాపుర వాసులు దు॰ఖిచారు. అంతలో నారదుడు సభాస్థలికి వచ్చాడు "నేటికి పదునాల్గవ సంవత్సరంలో దుర్యోధనుడి అపరాధం కారణంగా భీమార్జునుల బలంవలన కౌరవులు నశిస్తారు" అని చెప్పి అదృశ్యమయ్యాడు. అదివిని ధృతరాష్ట్రుడు మూర్చపోయాడు.విదిరుడు సముదాయించాడు. దుర్యోధనుడు, కర్ణుడు, శకుని ద్రోణాచార్యుల శరణు వేడారు. "నాకు ద్రుపదుడికి మైత్రికి సంబంధించి యుద్ధం జరిగినప్పుడు అతడిని ఓడించాను గదా! తర్వాత అతడు నన్ను చంపగలిగే శక్తిగల కుమారునికై యజ్ఞం చేసి దృష్టద్యుమ్నుడనే కుమారుని గన్నాడు. అతడు అగ్నిజ్వాలలనుండి కవచం, ధనుర్భానలతో నన్ను చంపేటందుకు పుట్టాడు. కాబట్టి యుద్ధం వచ్చిందంటే దృష్టద్యుమ్నుడు అర్జునుడి సహాయంతో సంహరిస్తాడు. కావున దృష్టద్యుమ్నుడు నా మృత్యువు అని తెలుసుకో, అందుకని మీ శ్రేయస్సాధనకై త్వరగా సన్నధం కండ" ని ద్రోణుడు అన్నాడు.
సభా పర్వము  సప్తమాశ్వాసము
భారతంలో ఉండేది భూమిపై ఎక్కడైనా ఉంటుంది భారతంలో లేనిది భూమిపై ఎక్కడా లేదు
రోజూ భారతం చదవండి భగవద్ అనుగ్రహం పొందండి
కామెంట్‌లు