"చెరకు దేవుడు":- - యామిజాల జగదీశ్



 తమిళనాడులో, శివుడికి అంకితమైన  1,300 సంవత్సరాల పురాతన ఆలయమొకటుంది. దాని పేరు కరుంబేశ్వరర్ ఆలయం.
తమిళనాడులోని తిరువారూర్ జిల్లాలోని కోయిల్వెన్ని (లేదా తిరువెన్ని)లో ఉందీ దేవాలయం. పరమేశ్వరుడిని ఇక్కడ 'చెరకు దేవుడు' అని అర్థం వచ్చే కరుంబేశ్వరర్ రూపంలో పూజిస్తారు. చక్కెర సంబంధిత ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నవారు ఈ సమస్య నుండి ఉపశమనం పొందుతారని భక్తుల నమ్మకం. ఆలయాన్ని సందర్శించడం వారికి ఎలా సహాయపడిందో చెప్పడానికి స్థానికులు కథలు కథలుగా చెప్పుకుంటారు. 
ఈ ఆలయాన్ని ప్రత్యేకంగా చేసేది దాని శివలింగంయొక్క విలక్షణమైన రూపం. స్థానికులు దీనిని కరుంబేశ్వర లింగం అని పిలుస్తారు. కరుంబు అనేది తమిళ పదం. కరుంబు అంటే చెరకు అని అర్థం. వ్యవసాయ సంబంధాన్ని ఈ ఆలయం గుర్తు చేస్తుంది. భక్తులు రవ్వ (సెమోలినా) వంటి చక్కెర ప్రసాదాన్ని అందించడం ప్రారంభించారు. దీనిని బెల్లం లేదా చక్కెరతో కలుపుతారు. ఇక్కడి శివాభిషేకాలు చెరకు రసంతో ప్రారంభమవుతాయి.
ఇక్కడ మరొక మానవతావాద ఆచారం ఏమిటంటే ఇక్కడ చీమలు, చిన్న కీటకాల మధ్య ప్రసాదం పంపిణీ. అవి నైవేద్యం సేవిస్తాయని చూపించే శక్తివంతమైన సంకేతం. అలాగే  మధుమేహం తీవ్రత తగ్గుతుందని ఆస్తికుల ప్రగాఢ నమ్మకం. ప్రత్యేక పూజలు, పదేపదే సందర్శించడం ద్వారా రక్తంలో చక్కెర స్థాయి నియంత్రణలో ఉంటుందని కొందరి అభిప్రాయం.
ఇది చాలా మందికి తెలియని ఆలయం. నిజంగానే వినని మాట కూడా. శ్రీరంగంలో రాత్రి బస చేసి మరుసటి రోజు ఉదయం మదురైకి వెళ్ళాలని ప్లాన్. ఈ విషయాన్ని హైదరాబాదులో ఉంటున్న పవనికి చెప్పగా వాళ్ళాయన రాజేశ్వరి శర్మ ఈ ఆలయం గురించి చెప్పి దర్శించి రమ్మని సూచించారు. అప్పుడే ఈ ఆలయం గురించి మాకు తెలిసింది.
ప్రభావితులైనవారు, సందర్శించిన వారు ఈ వెన్ని కరుంబేశ్వరర్ గురించిపంచుకున్న కథనాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అలాగే పలువురికి తెలియడం మొదలైంది. 
కాబట్టి వెయ్యి సంవత్సరాలకు పైగా ఉన్న ఈ ఆలయాన్ని సోషల్ మీడియా ఇటీవల కనుగొన్న ఆలయం అని చెప్పడం అతిశయోక్తి కాదు. తమిళ శైవ శ్లోకాలలో (తేవారం) దీని గురించి ప్రస్తావన కూడా ఉంది. అందువల్ల ఇది తమిళనాడులోని ఆలయాలలో దీనికి ప్రత్యేక స్థానమూ ఉంది.
ఇంతకీ భక్తులు ఏమి చేస్తారు?
ఆలయాన్ని సందర్శించే భక్తులు బెల్లం లేదా చక్కెరతో కలిపిన రవ్వను నైవేద్యంతో ఇక్కడకు వస్తారు. వారు మధుమేహ - హర (మధుమేహ తొలగించమని) ప్రత్యేక పూజలో కూడా పాల్గొంటారు. స్థానిక పూజారి సంప్రదాయాలలో కూడా కొన్ని తీపి ద్రవాలు లేదా చెరకు రసాలతో అభిషేకం చేస్తారు.
ఈ ఆలయంలో ప్రాంతీయ పండుగలను ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటారు.. శైవ ఆచారాలు,  తెప్పోత్సవం, వార్షిక ఉత్సవాలలో ప్రజలు భారీ సంఖ్యలో పాల్గొంటారు. 
వెన్ని కరుంబేశ్వరర్ ఆలయం మన్నార్గుడి నుండి 14 కిలోమీటర్ల దూరంలో ఉంది. తిరువరూర్ నుండి 28 కిలోమీటర్ల దూరంలో ఉంది.
మన్నార్గుడి, తిరువరూర్, తంజావూర్, కుంభకోణం, నాగపట్నం నుండి ఇక్కడికి రోడ్డు మార్గంలో చేరుకోవచ్చు. చెన్నై లేదా బెంగళూరు నుండైతే తంజావూరు నుంచి మన్నార్గుడి, కోయిల్వెన్ని ద్వారా ఇక్కడికి చేరుకుంటారు. ఇక్కడికి
సమీప రైల్వే స్టేషన్ పేరు మన్నార్గుడి రైల్వే స్టేషన్. ఇది ఆలయం నుండి దాదాపు 15 కి.మీ దూరంలో ఉంది. ఏదేమైనా నమ్మకంతోనూ సద్భక్తితోనూ దైవదర్శనం చేసుకోవటం ప్రధానం.



కామెంట్‌లు