అపరాధ భావన: - కోలా సత్యనారాయణ -విశాఖపట్నం
 నేను, మంగమ్మ కలిసి, మా ఊళ్లో ఎలిమెంటరీ స్కూల్లో ఒకటో తరగతి చదువుతున్నాం.  నా పేరు సూరమ్మ.   ఒకరోజు శివరాత్రి రోజుల్లో నేను మా నాన్నతో కలిసి కోటిపల్లి తీర్థం చూడ్డానికి బయలుదేరాను.
      దారిలో నా నేస్తం మంగమ్మ కలిసి, హుండీలో వేయమని ఒక రూపాయి నాణెం ఇచ్చింది.   నేను , నాన్నతో కలిసి గుడి దగ్గరకు చేరాక, దర్శనం కష్టమనిపించింది. భక్తుల లైను పెద్దదిగా ఉంది. 
 "ఈ రద్దీలో దర్శనం అవ్వాలంటే చీకటి పడిపోతుంది.  బస్సులు దొరకవు.   అందువల్ల గుడి గోపురానికి దండం పెట్టుకుని, తీర్థం చూసుకుని వెళ్ళిపోదాం" అన్నారు నాన్న. 
      తీర్థంలో దుకాణాలు అన్నీ చూసి, చిన్న చిన్న ఆటలు, పాటలు చూసి సరదా పడ్డాను.   నాన్న నాకు మిఠాయి, ఖర్జూరం కొనిపెట్టాడు.   కొంచెం దూరం తిరిగితే, ఒక చోట వేడివేడి పకోడీలు కనిపించాయి.  నాకు నోరు ఊరింది.  మంగమ్మ ఇచ్చిన రూపాయి గుర్తుకొచ్చి, దాంతో పకోడీలు కొని తిన్నాను.  చిన్నతనం మూలాన, అప్పుడు ఇది తప్పు అనిపించలేదు నాకు.   పైగా మంగమ్మ చూడలేదు కాబట్టి, హుండీలో వేశానని చెప్పొచ్చులే అనుకున్నాను. 
       కాలం గిర్రున తిరిగి, నాకు 16వ, ఏట పెళ్లయి,  మావారి ఉద్యోగ రీత్యా, వేరే ఊళ్ళో కాపురం చేసుకుంటున్నాను.   ఒకరోజు మంగమ్మ  ఇచ్చిన రూపాయి గుర్తుకొచ్చి, మా వారితో చెప్పాను.   "పోనీలే! ఈసారి పుట్టింటికి వెళ్ళినప్పుడు, కోటిపల్లి గుడి హుండీలో ఒక పది రూపాయలు వేసి రా!   నీ శంక  పోతుంది"  అని మా వారు సలహా ఇచ్చారు.   నేను అలాగే చేశాను.   కానీ... ఏదో వెలితి!!  మంగమ్మని కలిసి తన అపరాధం చెప్పుకుంటే, పాప ప్రక్షాళన అవుతుందని భావించి,  మంగమ్మ వాళ్ళ ఊరు బయలుదేరాను.  తీరా ఆ ఊరు వెళ్ళాక తెలిసింది...మంగమ్మ ఈ లోకంలో లేదని.  ఆ అపరాధ భావన నా మనసును ఇప్పటికీ తొలిచేస్తూనే ఉంది. 
                  *  సమాప్తం  *

కామెంట్‌లు