వినరో భాగ్యము విష్ణు కథలు: (8):- ఎం బిందుమాధవి
ఆ రోజు ఆదివారం.
“పిల్లలూ..ఈ రోజు మన విష్ణు సహస్రనామం క్లాస్ అయ్యాక బీచ్ కి వెళదాము అని చెప్పా కదా! త్వరగా తెమలండి మరీ. వచ్చేయాలి..క్లాసు మొదలుపెడుతున్నాను” అని తాతయ్య అనగానే.. ఎప్పుడెప్పుడు బీచ్ కి వెళ్లి ఆడుకుందామా అనే ఉత్సాహంతో పిల్లలంతా వచ్చి బుద్ధిగా కూర్చున్నారు.

“విశ్వం విష్ణుర్విష్ణు వషట్కారో భూత భవ్య భవత్ప్రభు:
భూత కృత్భూత భృద్భావో భూతాత్మా భూత భావన:
పుతాత్మా పరమాత్మాచ ముక్తానాం పరమాగతి:
అవ్యయ: పురుష: సాక్షి క్షేత్రజ్ఞోక్షర ఏవ చ”

తాతయ్య చెప్పిన శ్లోకాలు బుద్ధిగా వల్లె వేసి..లేచి చెప్పులేసుకుని బయటికెళ్లి తాతయ్య కోసం ఎదురు చూస్తున్నారు.
“తాతయ్యా త్వరగా రా..నీళ్ళల్లో ఆడుకోవాలి. ఇసుకతో పిచ్చుక గుళ్ళు కట్టుకోవాలి. గవ్వలు ఏరుకోవాలి” అని అందరూ తమ ప్లాన్ చెప్పి తాతయ్యని తొందర పెట్టారు. వాళ్ల సంతోషానికి పట్ట పగ్గాలు లేకుండా ఉంది.
@@@@
“ఒరేయ్ అలలు ఎలా ఎగిసి ఎగిసి పడుతున్నాయో చూడు. మీదికి వచ్చేస్తాయి. వెనక్కి వచ్చేయి” అని పవన్ అరిచాడు.
“ఏమీ రావు..చూడు..మన కాళ్ళు ముట్టుకుని మళ్లీ ఎలా వచ్చాయో అలాగే వెనక్కి వెళ్ళిపోతాయి. రండి ఇక్కడ రంగు రంగుల గవ్వలు ఉన్నాయి. ఏరుకుందాం. సముద్రంలో ముత్యాలు, పగడాలు, అనేక రకాల రాళ్లు కూడా ఉంటాయిట.” అని మిత్రులని ఉత్సాహ పరిచాడు వేణు.
“భలే కొత్త కొత్త రకాల చేపలు..అంటే జెల్లీ ఫిష్, టైగర్ ఫిష్, సొర చేపలు..పీతలు, డాల్ఫిన్స్, తిమింగలాలు కూడా ఉంటాయిట. మనం మొన్న సినిమాలో చూశాంకదా. కానీ అవన్నీ ఇప్పుడు మనకి కనిపించవు. సముద్రం లోపలికి వెళితే కనిపిస్తాయి” అన్నాడు ప్రకాష్.
“పిల్లలు ఇందాక మనం నేర్చుకున్న ‘విశ్వం’ అంటే ఇదే. సముద్రము, అందులో ఉండే అన్ని జలచరాలు, ఆల్గే లాంటి సముద్రపు మొక్కలు, అందులో దొరికే ముత్యాలు, పగడాలు ..అంటే మనకి కనిపించేవి, కనిపించనివి కూడా అన్నమాట..ఇంకా గవ్వలు, నత్త గుల్లలు అన్నీ శ్రీ మహా విష్ణువుస్వరూపమే! ఈ ఆకాశం, నేల, ఈ ఇసుక, చెట్లు అన్నీ ఆయన స్వరూపమే. అక్కడ సముద్రంలో దూరంగా కనిపించే పడవ, ఓడ, దానికి కట్టిన తెరచాప, పైన కనిపిస్తున్న చంద్రుడు, సూర్యుడు..వాటి నించి వస్తున్న కాంతి, చల్లదనం అన్నీ ఆయన స్వరూపాలే! అర్థమయిందా” అన్నారు తాతయ్య.
“అలా విశ్వమే తాను అయి అంత ఆవరించి ఉన్న ఆ దేవ దేవుడికి ఉండటం, లేకపోవటం, అయిపోవటం అనేవి ఉండవు. ఆయన అవ్యయుడు. ఎలా అంటే..మనుషులు, జంతువులు, పక్షులు,జలచరాలు, చెట్లు, ..చనిపోతూ ఉంటాయి. మళ్లీ కొత్తవి పుడుతూ ఉంటాయి. అవి లేకపోవటం అంటూ ఉండదు. పర్వతాలు కూడా ఆయన స్వరూపాలు..అవీ అంతే..అసలు పర్వతాలు లేకపోవటం, నేల అంతా సమతలంగా ఉండటం ఎప్పుడు జరగదు.”
“భూమిలో కొన్ని చోట్ల అడుగున బొగ్గు గనులు ఉంటాయి, కొన్ని చోట్ల ఖనిజాలు ఉంటాయి, కొన్ని చోట్ల నీటి బుగ్గలు ఉంటాయి. భగవంతుడి సర్వ వ్యాపకత్వం అంటే ఇదే! ఇవన్నీ ఏ పండితుడు, శాస్త్రజ్ఞుడు తయారు చేసి పెట్టినవి కావు. ఆ శ్రీ మహావిష్ణువే అన్నిటికీ కర్త! ఆయనే అన్నిటినీ కాపాడి రక్షిస్తూ ఉంటాడు. మనకి అవసరమైనప్పుడు అందుబాటులోకి తెచ్చి ఇస్తూ ఉంటాడు.”
“మనం అనుభవించే కొన్నిటికి రూపం ఉంటుంది, కొన్నిటికి ఉండదు. ఉదాహరణకి నీటికి ఒక ఇదమిత్థమైన రూపం ఉండదు. గ్లాసులో పోస్తే ఆ రూపం, బకెట్..మగ్గులో పోస్తే ఆ రూపం లో కనిపిస్తుంది. అలాగే ఆకాశానికి కూడా రూపం ఉండదు..మీకు కనిపించే నీలం, నలుపు అనేవి భూమికి ఆకాశానికి మధ్యలో ఉండే అనేక ధూళి, వాయువు, తేమ కణాల వల్ల ఆ రంగులతో ఆకాశం ఉన్నట్టు కనిపిస్తుంది. ఇక్కడి నించి చూడండి..దూరంగా ఆకాశం సముద్రాన్ని తాకినట్టు కనిపిస్తోంది. కానీ నిజానికి తాకదు. అలా కనపడేది వేరు, అక్కడ ఉండేది వేరు” అలా ఆ పరమాత్మ మనకి తెలిసేట్లు కొన్ని, తెలుసుకోలేనట్లు కొన్ని చేస్తూ ఈ విశ్వాన్ని నిర్వహిస్తూ ఉంటాడు..అర్థమయిందా” అన్నారు తాతయ్య.
“అలాంటి అతీత, అలౌకిక శక్తిని ముందు గుర్తించాలి. గౌరవించి, నమస్కరించాలి ..తెలిసిందా..రండి ఇంకా ఇంటికి వెళదాం” అని పిల్లలని బయలు దేరదీశారు.
కామెంట్‌లు
Popular posts
మహాభారతంలో ధర్మరాజుకు వాడిన పేర్లు.: -డా.బెల్లంకొండనాగేశ్వరరావు.
తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు--ఎం బిందుమాధవి
చిత్రం
బంజారా బాహుబలి పోర్య తార.: - డా ప్రతాప్ కౌటిళ్యా.
చిత్రం
అలిశెట్టి ప్రభాకర్ తను శవమై ఒకరికి వశమై తనువు పుండై ఒకడికి పండై ఎప్పుడూ ఎడారై ఎందరికో ఒయాసిస్సై.... నేను మొట్టమొదటగా చదివిన అలిశెట్టి ప్రభాకర్ కవిత ఇదే. అదీనూ హైదరాబాద్ రాంనగర్లో పాత్రికేయులు జి. కృష్ణగారింటికి భుజాన ఓ కెమేరా తగిలించుకుని వస్తున్నప్పటి నుంచీ ఎరుగుదును. ప్రభాకర్ నివాసముండిన ఇల్లు కృష్ణగారింటికి వెనకాతలే ఉండేది. ఒకటి కాదు రెండు కాదు తరచూ కృష్ణగారింటికి వచ్చివెళ్తుండేవారు ప్రభాకర్. వాళ్ళావిడ భాగ్యలక్ష్మిగారూ పిలల్లలూకూడా వస్తుండేవారు. కృష్ణగారికి ఓమారు ప్రభాకర్ ఓ చిన్ని కవితల పుస్తకం ఇవ్వగా అందులో "వేశ్య" కవిత చూసి బలే రాశారనుకున్నాను. క్రమంగా అలిశెట్టి ప్రభాకర్ అభిమానినయ్యాను. కానీ నేను ఆయనతో మాట్లాడింది చాలా చాలా తక్కువ. కృష్ణగారింటే కాదు రాంనగర్ రోడ్లల్లో ఎక్కడైనా కనిపిస్తే ఒక్క నవ్వు నవ్వేవాడిని.ఏడేళ్ళ క్రితం బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్బులో జనవరి 12వ తేదీన అలిశెట్టి ప్రభాకర్ కవితా సర్వస్వం ఆవిష్కృత సభ జరిగితే నేనూ రేణుకా వెళ్ళాం. ఆరోజు సభలో ఎవరెవరు ఏం మాట్లాడారో గుర్తుకు రావడం లేదు కానీ అలిశెట్టివారబ్బాయ్ సంగ్రామ్ తో మాట్లాడాను. పుస్తకం కొన్నాను. సంగ్రామ్ చాలా చిన్నవాడు నేను రాంనగర్లో చూసినప్పుడు. అలిశెట్టి కవితా సంపుటిలో మొత్తం ఏడు పుస్తకాల సమాహారం. మరో మాటలో చెప్పాలంటే మూడు వందల ముప్పై అయిదు పేజీలలోని ప్రతి మాటా ప్రభాకరంటే ఎవరో తెలియని వాళ్ళకీ తెలియచెప్తుంది. తన భార్య భాగ్యలక్ష్మి గారి గురించి ఓ కవిత రాశారు..... "నాకు బెర్నార్డ్ షాలు, షేక్ స్పియర్ లూ తెలియదు తనకు గుడిపాటి వెంకటాచలం, గురజాడా తెలియదుఇద్దరం ఉత్త పిచ్చివాళ్ళంకాని - అడుగంటిన కిరసనాయిలు స్టవ్ తో అన్నం ఎట్లా ఉడికించాలో తనకు తెలుసు దగ్గు తెరల నెత్తుటి రెపరెపల ఊపిరితిత్తుల్తోకవిత్వమెట్లా రాజేయాలో నాకు తెలుసు...."ఇలా తమకేం తెలీదు ఏం తెలుసువంటివి చెప్తూ ..."గాజుకుప్పెల్లాంటి నా కళ్ళల్లోనే ఆశల అగరొత్తులు వెలిగించుకుందే తప్పతులతూగే ఐశ్వర్యమో తులం బంగారమో కావాలని ఏనాడూ ప్రాధేయపడలేదు" అని రాసుకున్న మాటల్తో ప్రభాకర్ జీవనశైలీ, నిజాయితీ, పట్టుదల విదితమవుతాయి. మరణం నా చివరి చరణం కాదు అనే విభాగానికి రాసుకున్న ముందుమాటలో ప్రభాకర్ ... "వేదనాభరితమైన నా కవితాక్షరాన్ని వేశ్యా వాటికనే పలకమీద దిద్దుకున్నప్పుడూ అక్షరనేత్రం తెరిచి ఆనాటి దొరతనాన్ని ఆగ్రహించినప్పుడూ బహుశా నాకు పద్దెనిదేళ్ళు" అని చెప్తూ కుంచె నుంచి ప్రవహించే చైతన్యం ఘనీభవించి కెమేరా ముందు సృజనాత్మకత ఒక అపరిపక్వ స్వప్నంగానే చితికిపోయి నానాటికీ దారిద్ర్యమనే ఊబిలోకి దిగబడి బహుశా ఏ పౌరుడూ పాత్రికేయుడూ పడనన్ని కష్టాలతో చితికి చితికి చివరికి పత్రిక పారితోషికమే జీవనాధారంగా స్వీకరిస్తున్న నేపథ్యంలో హృదయం విప్పి నన్నీ నాలుగు మాటలు చెప్పుకోనివ్వండీ అన్నారు ప్రభాకర్! చిత్రలేఖనంలో చమత్కారంతో పాటు పదునైన కవిత్వం రాయడంలో అలిశెట్టి ప్రభాకర్ అందవేసిన చేయి. ఆయన సాహిత్యంలో కవి కాళోజీ భావాలు కనిపిస్తుంటాయి. తాను గీసిన చిత్రానికి తనే కవిత్వం కూడా రాసుకునే ప్రక్రియతో విశేష ఆదరణ పొందిన ప్రభాకర్ మాటలు ఎంతో మందికి ప్రేరణగా నిలుస్తాయి. ప్రభాకర్ శారీరకంగా మనతో లేకపోయినా ఆయన తన చిత్రకవితల ద్వారా ఎప్పటికీ సజీవంగానే ఉంటూ ఉంటారు. ప్రభాకర్‌లాంటి సామాజిక స్పృహ కలిగిన కవులు భవిష్యత్ తరాలకు ఎంతో అవసరం. ఆయన మినీకవితలు తెలుగు రాష్ట్రాలలో ప్రఖ్యాతి చెందినవే. జననం, మరణం ఒకే రోజున (జనవరి 12) కావడం యాధృచ్ఛికం. "అలిశెట్టి ప్రభాకర్ ఓ కవిత్వ మాంత్రికుడు. కుంచెని, కెమెరా లెన్సుని, కలాన్ని ఏకం చేసి తెలుగు కవితకు పుష్టి చేకూర్చిన వినూత్నకవి. ఆయన కవిత్వం గోడలపై నినాదాలై, వ్యాసాలకు మొదలు తుదలై, ప్రజల నోటి నుడికారమై మన మధ్యే ఉంటోంది" అన్న జయధీర్ తిరుమలరావు గారి మాట అక్షర సత్యం. శ్రీశ్రీ తరువాత అంత ఎక్కువగా ‘కోట్’ చేసే కవిత్వం ప్రభాకర్‌ గారిది.సమాజ మార్పును ఆకాంక్షిస్తూ 'మరణం నా చివరి చరణం’ కాదని, సమరమే తన అంతిమ చిరునామా అని ప్రకటించిన ప్రభాకర్ మాన్యుల కవి కాదు, సామాన్యుల కవిగా ముద్రపడిన కవి అని ఆయన సన్మిత్రులైన బి. నర్సన్ గారి అభిప్రాయం. ఆయన కవిత్వంలో సూటిదనం, సరళతలతో పాటు ఒకింత సాహసం కూడా ఉండడమే ప్రభాకర్‌ను భిన్న కవిగా, జనపక్షపాతిగా నిలబెట్టిందన్నారాయన. ప్రభాకర్‌ వ్యక్తిత్వమే ఆయన అక్షరాల్లో ప్రతిఫలించి ఆయన్ని ఉద్యమ కవిగా నిలబెట్టిందనికూడా చెప్పారు బి. నర్సన్.తను రాసి గీసిన కవితా చిత్రాల ఫ్రేమ్‌ల అమ్మకానికీ ముందుకు రాలేదు. ఓసారి ప్రభాకర్‌ తన కవితాచిత్రాలను చేతిలో పట్టుకొని స్కూటర్‌ వెనకాల కూర్చున్నారు. కోఠి చౌరస్తా వద్ద సిగ్నల్‌ పడింది. పక్కనే కారులో ఉన్నాయన ప్రభాకర్‌ చేతిలోని చిత్రాలను చూసి సిగ్నల్‌ దాటాక ఆగవలసిందిగా కోరారు.స్కూటర్‌ నడుపుతున్నాయన ముందుకెళ్లి ఆపారు.కారులోంచి దిగొచ్చిన మనిషి ఓ ఫ్రేమ్‌ చూపిస్తూ అది తనకు కావాలని, ఎంతకిస్తారని అడిగారు.కానీ ప్రభాకర్ "అది అమ్మడానికి కాదని జవాబిచ్చారు. కావాలని అడిగిన మనిషి ఎన్టీఆర్‌కు దగ్గరి బంధువు, ఆనాడు పార్లమెంట్‌ సభ్యుడు. స్కూటర్‌పై ప్రభాకర్‌ను తీసుకెళ్లిన ఓ మిత్రుడు నర్సన్ గారికి చెప్పడంతో ఈ విషయం తెలిసింది.స్వస్థలం నుంచిహైదరాబాద్‌ వచ్చాక ప్రభాకర్‌ గారికి ఫొటో స్టూడియో చిరునామాగా మిగిలింది గాని ఆదాయ వనరు కాలేదు. కిరాయి చెల్లించలేక విద్యానగర్‌ నుండి స్టూడియోను నారాయణగూడ నాలా పక్కన పాత దుకాణంలోకి మార్చారు. కవితలతో అందరి అభిమానాన్ని పొందిన ప్రభాకర్ తన 39వ ఏట 1993 జనవరి 12 వ తేదీ ఉదయం తుదిశ్వాస విడిచారు. నాకెంతో ఇష్టమైన కవి. చిత్రకవి. డబ్బుకోసం వెంపర్లాడని ప్రభాకర్ కలాన్ని మాత్రమే అందుకున్న కవి. అక్షరాన్ని నమ్ముకున్న కవి. అంతేతప్ప తనను అమ్ముకోని మహా కవి.- యామిజాల జగదీశ్
చిత్రం
సమయం !!: - సునీతా ప్రతాప్ ఉపాధ్యాయిని పాలెం.
చిత్రం