ఎంతెంత దూరం... చానా చానా దూరం: - డా.ఎం.హరికిషన్-కర్నూలు-9441032212

 ఒక అడవిలో ఒక చక్కని పూలతోట వుండేది. అందులో రంగురంగుల సీతాకోకచిలుకలు చానా వున్నాయి. అవి హాయిగా ఆడతా, పాడతా, ఎగురుతా, దుంకుతా ఆకలైనప్పుడల్లా తనివితీరా తేనె తాగుతా సంబరంగా వుండేవి. ఒకరోజు ఒక సీతాకోకచిలుక అక్కడ ఆడుకుంటా వుంటే అనుకోకుండా పెద్దగాలి వచ్చింది. ఆ గాలికి పెద్ద పెద్ద చెట్టుకొమ్మలే ఓ అని కిందికీ, మీదికీ వూగిపోతా వున్నాయి. ఇక సీతాకోకచిలుకలు ఎంత. ఈ సీతాకోకచిలుక ఆ గాలికి రయ్యిమని కొట్టుకోని పోతాపోతా దూరంలో ఆగి వున్న ఒక కారులో పడింది.
అంతలో అక్కడికి వురుక్కుంటా ఒకతను ముగ్గురు పిల్లలతో వచ్చినాడు. ''రేయ్‌-తొందరగా ఎక్కి కిటికీలు వేసేయండి. లేకుంటే కారంతా దుమ్ముతో గబ్బులేసి పోతాది అంటా గట్టిగా అరిచినాడు. వెంటనే పిల్లలంతా బెరబెరా లోపలికి దూరి సరసరా కిటికీలు వేసేసినారు.
సీతాకోకచిలుక ఆ పిల్లలను చూసి భయంతో వణికిపోయింది. ''అమ్మో... ఈ పిల్లలకు గానీ కనబన్నానంటే ఇంకేమన్నా వుందా... ఛటుక్కున రెక్కలు పట్టేసుకుంటారు. కొంచం గట్టిగా వత్తితే చాలు నుసినుసి అయిపోతాయి. బాధతో నరాలు జివ్వుమంటాయి. ఈ పిల్లలకు మంచేదో చెడేదో తెలీదు. వాళ్ళకేమో ఆనందం, మాకేమో చావు భయం అనుకుంటా నెమ్మదిగా వెనుక సీటు కిందికి పోయి మట్టసంగా దాక్కోనింది. కారు దాదాపు గంటసేపు రయ్యిమని పోయి ఒకచోట ఆగింది. పిల్లలు అంతా ఒక్కొక్కరే దిగుతా వున్నారు. అది చూసి సీతాకోకచిలుక ''వెంటనే తప్పించుకోవాలి. లేదంటే మళ్ళా తలుపులు వేసి కిటికీలు బిగించి వెళ్ళిపోతారు. లోపల గాలి వేడెక్కి వూపిరి ఆడక చచ్చిపోతా'' అనుకోనింది. వెంటనే సర్రున వాళ్ళ తలల మీద నుంచి ఎగురుకుంటా వేగంగా బైటకు వెళ్ళిపోయింది.
ఆ సీతాకోకచిలుకకు అక్కడ అంతా కొత్తగా వుంది. పచ్చని మొక్కలు లేవు. విచ్చిన పూవులు లేవు. పక్షుల కూతలు లేవు. చల్లని గాలులు లేవు. ఎక్కడ చూసినా ఆకాశమంత భవనాలు, రయ్యిమని తిరిగే వాహనాలు, చెవులు పగిలిపోయేలా చప్పుళ్ళు, ఆకాశమంతా నిండిపోయిన దుమ్ము మేఘాలు. సీతాకోకచిలుకకు ఇంటికి ఎలా పోవాలో తెలీడం లేదు. ఎవరు సాయపడతారా అని వెదకసాగింది. అలా వెదుకుతా వెదుకుతాపోతావుంటే ఆఖరికి ఒకచోట దానికి ఒక చిన్నపిట్ట కనబడింది.
వెంటనే సీతాకోకచిలుక సంబరంగా దగ్గరకు పోయి ''పిట్టమామా... పిట్టమామా నేను సీతాకోకచిలుకను. దారి తప్పిపోయినాను. నువ్వు నా ఇంటికి నన్ను తీసుకోని పోగలవా'' అని అడిగింది దీనంగా. పిట్టకు జాలి వేసింది. అది గూడా చిన్నప్పుడు వాళ్ళ అమ్మానాన్నల నుంచి తప్పిపోయినదే. వెదకీ వెదకీ అలసిపోయి ఒంటరిగా తిరుగుతా వుంది. అందుకే దానికి ఆ బాధ తెలుసు. దాంతో ''అల్లుడూ... బాధపడకురా... నేనున్నా గదా... చెప్పు నువ్వు ఎక్కడ వుంటావు'' అని అడిగింది.
అప్పుడు ఆ సీతాకోకచిలుక కళ్ళు మూసుకోని ''నాది చానా అందమైన తోట. ఎక్కడ చూసినా రంగురంగుల పూలతో కళకళలాడతా వుంటాది'' అనింది. ఆ మాటలకు పిట్ట నవ్వి ''అది కాదు అల్లుడూ... తోటలంటే చానా వుంటాయి. ముందు ఇది చెప్పు. నీ తోటకు చుట్టుపక్కల జంతువులు మొక్కలు వుంటాయా లేక ఇళ్ళు, మనుషులు వుంటారా'' అని అడిగింది. అప్పుడు సీతాకోకచిలుక ''మా తోట చుట్టూ మొక్కలూ, జంతువులే వుంటాయి మామా'' అని చెప్పింది. దానికి పిట్ట ''ఓహో... అలాగా... ఐతే అది అడవే. నాకు అడవి గురించి పెద్దగా ఏమీ తెలీదు. ఐనా దిగులు పడకు. ఏదయినా అడవి పావురం కనబడితే అడుగుదాం. నా వెంబడిరా'' అనింది.
రెండూ ఎగురుకుంటా ఎగురుకుంటా తిరుగుతా వుంటే ఒక చెట్టు మీద ఒక అడవి పావురం కనబడింది. వెంటనే పిట్ట దాని దగ్గరికి పోయి ''ఓ పావురం మామా... పావురం మామా... కొంచెం సాయం చేయవా. ఈ చిన్ని సీతాకోకచిలుక దారి తప్పిపోయింది'' అంటా జరిగిందంతా చెప్పింది.
అప్పుడు పావురం నవ్వి ''చూడండి అల్లుళ్ళూ ఈ వూరి చుట్టూ వుండే అడవిలో చానా తోటలు వున్నాయి. నీది ఏ తోటనో ఎలా కనుక్కోవడం. బాగా ఆలోచించు. తోట చుట్టుపక్కల ఇంకా ఏమైనా వున్నాయా'' అని అడిగింది.
సీతాకోకచిలుక బాగా ఆలోచించి ''ఆ... మతికి వచ్చింది. ఆ తోట పక్కనే ఒక పెద్ద చెరువు వుంది'' అనింది సంబరంగా. అప్పుడు ఆ పావురం నవ్వి చెరువులు ఎక్కడెక్కడ వుంటాయో కొంగలకు బాగా తెలుసు. అవి ఎప్పుడూ చేపల కోసం చెరువులను వెతుకుతుంటాయి గదా! దాన్ని పోయి అడుగు. నీ తోట ఎక్కడుంటాదో తెలిసిపోతుంది'' అనింది.
దాంతో పిట్ట, సీతాకోకచిలుక కలిసి ఎక్కడయినా కొంగ కనబడుతుందేమో అని వెదకసాగినాయి. అlaa తిరుగుతా తిరుగుతా వుంటే ఒకచోట ఒక పెద్ద కొంగ కనిపించింది. పిట్ట సంబరంగా కొంగ దగ్గరికి పోయి ''కొంగమామా... కొంగమామా... కొంచెం సాయం చేయవా... ఈ సీతాకోకచిలుక దారి తప్పిపోయింది'' అంటా జరిగిందంతా చెప్పింది.
అప్పుడు ఆ కొంగ కాసేపు ఆలోచించి ''చూడు అల్లుళ్ళూ... నాకు తెలిసి ఈ వూరికి చుట్టుపక్కల దాదాపు పది చెరువులు వున్నాయి. నీది ఏ చెరువో ఎలా కనుక్కోవడం. ఇంకొంచం బాగా ఆలోచించు. ఆ చెరువు గట్టున ఏమైనా వున్నాయా'' అని అడిగింది.
సీతాకోకచిలుక బాగా ఆలోచించి ''ఆ... మతికి వచ్చింది ఆ చెరువు గట్టున ఒక పెద్ద మామిడిచెట్టు వుంది'' అనింది సంబరంగా.
కొంగ నవ్వి ''నా చూపంతా చెరువులోని చేపలపైనే గానీ... చుట్టూ వుండే మొక్కలపై వుండదు. మామిడితోటలంటే చిలుకలకు బాగా తెలుసు. అవి ఎక్కడ మంచి పళ్ళున్నా వదలవు. పోయి వాటిని అడుగు'' అని చెప్పింది.
ఆ మాటలకు సీతాకోకచిలుకకు నీరసం ముంచుకు వచ్చింది. బాధతో కళ్ళల్లో నీళ్ళు తిరిగినాయి. అది చూసి పిట్ట ''అల్లుడూ నువ్వు దిగులు పడకు. ఓపిక పడితే విజయం మనదే. చివరి వరకు పోరాడాల గానీ ఇలా సగంలోనే నీరసపడగూడదు. లే పోదాం'' అంటా తీసుకోని పోయింది.
రెండూ తిరుగుతా వుంటే ఒక చోట ఒక జామచెట్టు మీద ఒక రామచిలుక దోరకాయ కొరుకుతా కనబడింది. వెంటనే పిట్ట సంబరంగా చిలుక దగ్గరకు పోయి ''చిలుకమామా... చిలుకమామా... కొంచం సాయం చేయవా... ఈ చిన్ని సీతాకోకచిలుక దారి తప్పిపోయింది'' అంటా జరిగిందంతా చెప్పింది.
అది విని చిలుక నవ్వి '' నేనెప్పుడూ అలా పోలేదు గానీ... ఒకసారి మా మామ చెప్పాడు. ఇలాగే ఉత్తరం వైపు ఒక గంట సర్రున దూసుకోని పోతే ఒక చెరువు, దాని పక్కన రంగురంగుల తోట, చెరువు ఒడ్డున పెద్ద మామిడి చెట్టు వున్నాయట. ఒకరోజు పోయి తనివితీరా తిని వద్దాం అనుకుంటా వున్నా. బహుశా నీవు చెబుతున్న తోట అదే కావచ్చు'' అంటా ఎలా పోవాలో దారి చెప్పింది.
వెంటనే పిట్ట, సీతాకోకచిలుకను భుజం మీద ఎక్కించుకోని రివ్వున ఎగురుతా... అక్కడక్కడ ఆగి పళ్ళు తింటా... నీళ్ళు తాగుతా... సాయంకాలానికంతా చెరువుగట్టు మీద వున్న మామిడిచెట్టును చేరుకోనింది. ఆ పూలతోటను చూసేసరికి సీతాకోకచిలుక ''ఇదే మా తోట'' అంటా సంబరంగా ఎగిరి గంతులు వేసింది. తోటలోని మిగతా సీతాకోకచిలుకలన్నీ వాటి చుట్టూ గుంపయినాయి. జరిగిందంతా తెలుసుకోని పిట్టను బాగా మెచ్చుకున్నాయి. మంచి మంచి మాగిన మామిడి పళ్ళతో, తీయని తేనెతో గొప్ప విందును ఇచ్చినాయి.
**********

కామెంట్‌లు
Popular posts
మహాభారతంలో ధర్మరాజుకు వాడిన పేర్లు.: -డా.బెల్లంకొండనాగేశ్వరరావు.
తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు--ఎం బిందుమాధవి
చిత్రం
బంజారా బాహుబలి పోర్య తార.: - డా ప్రతాప్ కౌటిళ్యా.
చిత్రం
అలిశెట్టి ప్రభాకర్ తను శవమై ఒకరికి వశమై తనువు పుండై ఒకడికి పండై ఎప్పుడూ ఎడారై ఎందరికో ఒయాసిస్సై.... నేను మొట్టమొదటగా చదివిన అలిశెట్టి ప్రభాకర్ కవిత ఇదే. అదీనూ హైదరాబాద్ రాంనగర్లో పాత్రికేయులు జి. కృష్ణగారింటికి భుజాన ఓ కెమేరా తగిలించుకుని వస్తున్నప్పటి నుంచీ ఎరుగుదును. ప్రభాకర్ నివాసముండిన ఇల్లు కృష్ణగారింటికి వెనకాతలే ఉండేది. ఒకటి కాదు రెండు కాదు తరచూ కృష్ణగారింటికి వచ్చివెళ్తుండేవారు ప్రభాకర్. వాళ్ళావిడ భాగ్యలక్ష్మిగారూ పిలల్లలూకూడా వస్తుండేవారు. కృష్ణగారికి ఓమారు ప్రభాకర్ ఓ చిన్ని కవితల పుస్తకం ఇవ్వగా అందులో "వేశ్య" కవిత చూసి బలే రాశారనుకున్నాను. క్రమంగా అలిశెట్టి ప్రభాకర్ అభిమానినయ్యాను. కానీ నేను ఆయనతో మాట్లాడింది చాలా చాలా తక్కువ. కృష్ణగారింటే కాదు రాంనగర్ రోడ్లల్లో ఎక్కడైనా కనిపిస్తే ఒక్క నవ్వు నవ్వేవాడిని.ఏడేళ్ళ క్రితం బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్బులో జనవరి 12వ తేదీన అలిశెట్టి ప్రభాకర్ కవితా సర్వస్వం ఆవిష్కృత సభ జరిగితే నేనూ రేణుకా వెళ్ళాం. ఆరోజు సభలో ఎవరెవరు ఏం మాట్లాడారో గుర్తుకు రావడం లేదు కానీ అలిశెట్టివారబ్బాయ్ సంగ్రామ్ తో మాట్లాడాను. పుస్తకం కొన్నాను. సంగ్రామ్ చాలా చిన్నవాడు నేను రాంనగర్లో చూసినప్పుడు. అలిశెట్టి కవితా సంపుటిలో మొత్తం ఏడు పుస్తకాల సమాహారం. మరో మాటలో చెప్పాలంటే మూడు వందల ముప్పై అయిదు పేజీలలోని ప్రతి మాటా ప్రభాకరంటే ఎవరో తెలియని వాళ్ళకీ తెలియచెప్తుంది. తన భార్య భాగ్యలక్ష్మి గారి గురించి ఓ కవిత రాశారు..... "నాకు బెర్నార్డ్ షాలు, షేక్ స్పియర్ లూ తెలియదు తనకు గుడిపాటి వెంకటాచలం, గురజాడా తెలియదుఇద్దరం ఉత్త పిచ్చివాళ్ళంకాని - అడుగంటిన కిరసనాయిలు స్టవ్ తో అన్నం ఎట్లా ఉడికించాలో తనకు తెలుసు దగ్గు తెరల నెత్తుటి రెపరెపల ఊపిరితిత్తుల్తోకవిత్వమెట్లా రాజేయాలో నాకు తెలుసు...."ఇలా తమకేం తెలీదు ఏం తెలుసువంటివి చెప్తూ ..."గాజుకుప్పెల్లాంటి నా కళ్ళల్లోనే ఆశల అగరొత్తులు వెలిగించుకుందే తప్పతులతూగే ఐశ్వర్యమో తులం బంగారమో కావాలని ఏనాడూ ప్రాధేయపడలేదు" అని రాసుకున్న మాటల్తో ప్రభాకర్ జీవనశైలీ, నిజాయితీ, పట్టుదల విదితమవుతాయి. మరణం నా చివరి చరణం కాదు అనే విభాగానికి రాసుకున్న ముందుమాటలో ప్రభాకర్ ... "వేదనాభరితమైన నా కవితాక్షరాన్ని వేశ్యా వాటికనే పలకమీద దిద్దుకున్నప్పుడూ అక్షరనేత్రం తెరిచి ఆనాటి దొరతనాన్ని ఆగ్రహించినప్పుడూ బహుశా నాకు పద్దెనిదేళ్ళు" అని చెప్తూ కుంచె నుంచి ప్రవహించే చైతన్యం ఘనీభవించి కెమేరా ముందు సృజనాత్మకత ఒక అపరిపక్వ స్వప్నంగానే చితికిపోయి నానాటికీ దారిద్ర్యమనే ఊబిలోకి దిగబడి బహుశా ఏ పౌరుడూ పాత్రికేయుడూ పడనన్ని కష్టాలతో చితికి చితికి చివరికి పత్రిక పారితోషికమే జీవనాధారంగా స్వీకరిస్తున్న నేపథ్యంలో హృదయం విప్పి నన్నీ నాలుగు మాటలు చెప్పుకోనివ్వండీ అన్నారు ప్రభాకర్! చిత్రలేఖనంలో చమత్కారంతో పాటు పదునైన కవిత్వం రాయడంలో అలిశెట్టి ప్రభాకర్ అందవేసిన చేయి. ఆయన సాహిత్యంలో కవి కాళోజీ భావాలు కనిపిస్తుంటాయి. తాను గీసిన చిత్రానికి తనే కవిత్వం కూడా రాసుకునే ప్రక్రియతో విశేష ఆదరణ పొందిన ప్రభాకర్ మాటలు ఎంతో మందికి ప్రేరణగా నిలుస్తాయి. ప్రభాకర్ శారీరకంగా మనతో లేకపోయినా ఆయన తన చిత్రకవితల ద్వారా ఎప్పటికీ సజీవంగానే ఉంటూ ఉంటారు. ప్రభాకర్‌లాంటి సామాజిక స్పృహ కలిగిన కవులు భవిష్యత్ తరాలకు ఎంతో అవసరం. ఆయన మినీకవితలు తెలుగు రాష్ట్రాలలో ప్రఖ్యాతి చెందినవే. జననం, మరణం ఒకే రోజున (జనవరి 12) కావడం యాధృచ్ఛికం. "అలిశెట్టి ప్రభాకర్ ఓ కవిత్వ మాంత్రికుడు. కుంచెని, కెమెరా లెన్సుని, కలాన్ని ఏకం చేసి తెలుగు కవితకు పుష్టి చేకూర్చిన వినూత్నకవి. ఆయన కవిత్వం గోడలపై నినాదాలై, వ్యాసాలకు మొదలు తుదలై, ప్రజల నోటి నుడికారమై మన మధ్యే ఉంటోంది" అన్న జయధీర్ తిరుమలరావు గారి మాట అక్షర సత్యం. శ్రీశ్రీ తరువాత అంత ఎక్కువగా ‘కోట్’ చేసే కవిత్వం ప్రభాకర్‌ గారిది.సమాజ మార్పును ఆకాంక్షిస్తూ 'మరణం నా చివరి చరణం’ కాదని, సమరమే తన అంతిమ చిరునామా అని ప్రకటించిన ప్రభాకర్ మాన్యుల కవి కాదు, సామాన్యుల కవిగా ముద్రపడిన కవి అని ఆయన సన్మిత్రులైన బి. నర్సన్ గారి అభిప్రాయం. ఆయన కవిత్వంలో సూటిదనం, సరళతలతో పాటు ఒకింత సాహసం కూడా ఉండడమే ప్రభాకర్‌ను భిన్న కవిగా, జనపక్షపాతిగా నిలబెట్టిందన్నారాయన. ప్రభాకర్‌ వ్యక్తిత్వమే ఆయన అక్షరాల్లో ప్రతిఫలించి ఆయన్ని ఉద్యమ కవిగా నిలబెట్టిందనికూడా చెప్పారు బి. నర్సన్.తను రాసి గీసిన కవితా చిత్రాల ఫ్రేమ్‌ల అమ్మకానికీ ముందుకు రాలేదు. ఓసారి ప్రభాకర్‌ తన కవితాచిత్రాలను చేతిలో పట్టుకొని స్కూటర్‌ వెనకాల కూర్చున్నారు. కోఠి చౌరస్తా వద్ద సిగ్నల్‌ పడింది. పక్కనే కారులో ఉన్నాయన ప్రభాకర్‌ చేతిలోని చిత్రాలను చూసి సిగ్నల్‌ దాటాక ఆగవలసిందిగా కోరారు.స్కూటర్‌ నడుపుతున్నాయన ముందుకెళ్లి ఆపారు.కారులోంచి దిగొచ్చిన మనిషి ఓ ఫ్రేమ్‌ చూపిస్తూ అది తనకు కావాలని, ఎంతకిస్తారని అడిగారు.కానీ ప్రభాకర్ "అది అమ్మడానికి కాదని జవాబిచ్చారు. కావాలని అడిగిన మనిషి ఎన్టీఆర్‌కు దగ్గరి బంధువు, ఆనాడు పార్లమెంట్‌ సభ్యుడు. స్కూటర్‌పై ప్రభాకర్‌ను తీసుకెళ్లిన ఓ మిత్రుడు నర్సన్ గారికి చెప్పడంతో ఈ విషయం తెలిసింది.స్వస్థలం నుంచిహైదరాబాద్‌ వచ్చాక ప్రభాకర్‌ గారికి ఫొటో స్టూడియో చిరునామాగా మిగిలింది గాని ఆదాయ వనరు కాలేదు. కిరాయి చెల్లించలేక విద్యానగర్‌ నుండి స్టూడియోను నారాయణగూడ నాలా పక్కన పాత దుకాణంలోకి మార్చారు. కవితలతో అందరి అభిమానాన్ని పొందిన ప్రభాకర్ తన 39వ ఏట 1993 జనవరి 12 వ తేదీ ఉదయం తుదిశ్వాస విడిచారు. నాకెంతో ఇష్టమైన కవి. చిత్రకవి. డబ్బుకోసం వెంపర్లాడని ప్రభాకర్ కలాన్ని మాత్రమే అందుకున్న కవి. అక్షరాన్ని నమ్ముకున్న కవి. అంతేతప్ప తనను అమ్ముకోని మహా కవి.- యామిజాల జగదీశ్
చిత్రం
సమయం !!: - సునీతా ప్రతాప్ ఉపాధ్యాయిని పాలెం.
చిత్రం