సంపూర్ణ మహాభారతము*సరళ వ్యావహారిక భాషలో...!

 వన పర్వము తృతీయాశ్వాసము:- 95 వ రోజు
అష్టావక్రుడు
ఆ తరువాత రోమశుడు ధర్మరాజుకు అష్టావకృడిని గురించి చెప్పసాగాడు. పూర్వం ఏకపాదుడనే ముని ఉండే వాడు. అతని భార్య పేరు సుజాత. అతను ఘోరమైన తపస్సు చేశాడు. తన శిష్యులకు సదా విద్యా బుద్ధులు నేర్పుతుండే వాడు. కొంత కాలానికి సుజాత గర్భం ధరించింది. ఒకరోజు సుజాత గర్భంలో ఉన్న శిశువు ఏకపాదునితో ఇలా అన్నాడు. " మీరు ఇలా అహోరాత్రులు పాఠాలు చదివిస్తుంటే వారికి విద్య ఎలా వస్తుంది. వారికి నిద్ర లేక పోవడం చేత విశ్రాంతి లేక జఢులౌతారు. ఇది మంచిదా? " అని అడిగాడు. అందుకు ఏకపాదుడు ఆగ్రహించి " నేను చేయించిన వేదాధ్యయనాన్ని వక్రించి చెప్పావు కనుక నీవు అష్టా వక్రుడిగా పుట్టు " అని శపించాడు. సుజాత పురిటి సమయానికి తిండి గింజలు సంపాదించడానికి ఏకపాదుడు జనకుని వద్దకు వెళ్ళాడు. కాని అక్కడ ఉన్న వందితో వాదించి పరాజయం పొందాడు. సుజాత అష్టావక్రుడిని ప్రసవించింది. అష్టావక్రుడు పెద్దవాడయ్యాడు. తన తండ్రిని వెతుకుతూ మేనమామ కొడుకు శ్వేతకేతునితో జనక మహారాజు చేస్తున్న యజ్ఞానికి వెళ్ళాడు. కాని వారిని ద్వారపాలకులు అడ్డగించి " మీరు బాలురు ఇది విద్వాంసులు, పెద్దలు, రుత్విక్కులకు మాత్రమే ప్రవేశార్హత మీకు లేదు " అని అడ్డగించారు. అష్టావక్రుడు " అయ్యా! వయస్సుతో జ్ఞానం రాదు కదా? కనుక జ్ఞానం కలవాడు బాలుడైనా అర్హుడే? మేము ఈ మహారాజు కొలువులో ఉన్న విద్వాంసులను జయించడానికి వచ్చాము " అని అన్నాడు. ఈ విషయం తెలిసి మహారాజు వారిని లోనికి పిలిపించాడు. అష్టావక్రుడు అక్కడున్న విద్వాంసులందర్ని ఓడించి తండ్రిని మిగిలిన బ్రాహ్మణులను చెర నుండి విడిపించాడు. జనక మహారాజు అష్టావక్రుని ఘనంగా సన్మానించాడు. అష్టావక్రుడు తన తండ్రితో కలసి స్వస్థలానికి వెళ్ళాడు.
యువక్రీతుడు
ఆ తరువాత ధర్మరాజు సంగమ నదీ తీరం చేరాడు. రోమశుడు ధర్మరాజుకు రైభ్యాశ్రమం, భరద్వాజాశ్రమం చూపించి యువక్రీతుని గురించి చెప్పసాగాడు. రైభ్యుడు, భరద్వాజుడు అనే మహా ఋషులు ఉన్నారు. వారిరువురు మిత్రులు. వారిద్దరు అడవిలో తపస్సు చేసుకుంటున్నారు. రైభ్యునికి అర్ధావసుడు, పరావసుడు అనే కుమారులు ఉన్నారు. వారిద్దరూ మంచి విద్యావంతులు. భరద్వాజునికి ఒక కుమారుడుండే వాడు. అతని పేరు యువక్రీతుడు. యువక్రీతునకు అర్ధావసు పరావసు అంటే అసూయ. అందుకని కష్టపడకుండా సకల విద్యలు రావాలనే సంకల్పించి ఇంద్రుని గురించి తపస్సు చేసాడు. ఇంద్రుడు ప్రత్యక్షమై "ఏ కోరికతో ఇంత ఘోర తపస్సు చేసావు ? " అని అడిగాడు. యువక్రీతుడు " నాకు చదవకుండానే సకల శాస్త్రాలు, వేదాలు అవగతం కావాలి " అని కోరాడు. ఇంద్రుడు " ఇది అసంభవం. తపస్సు వలన వచ్చే విద్య మత్సరాన్ని కలిగిస్తుంది. అది మంచిది కాదు. విద్య గురు ముఖతః నేర్చుకోవడం ఉత్తమం " అన్నాడు. అందుకు యువక్రీతుడు అంగీకరించ లేదు. ఇంద్రుడు వెళ్ళి పోయాడు. యువక్రీతుడు తపస్సు కొనసాగించాడు. మరల ఇంద్రుడు ఒక వృద్ధ బ్రాహ్మణ రూపంలో వచ్చి అక్కడ ప్రవహిస్తున్న గంగా ప్రవాహానికి అడ్డంగా పిడికిళ్ళతో ఇసుక పోసి సేతుబంధనం చేయసాగాడు. అది చూసి యువక్రీతుడు నవ్వి " వృద్ధుడా! ఇదేమి పని? ఇలా ఎన్ని రోజులు చేస్తే ఈ సేతువు పూర్తి ఔతుంది " అన్నాడు. ఆ వృద్ధుడు " నేను నీలా సాధ్యం కాని దాని కోసం ప్రయత్నిస్తున్నాను " అన్నాడు. ఇంద్రుడు నిజరూపం చూపి " యువక్రీతా ! నేను చేసిన పని ఎంత నిరర్ధకమో నీవు చేసే తపస్సు అంతే నిరర్ధకం. కనుక నీ ప్రయత్నం మానుకో " అన్నాడు. అందుకు యువక్రీతుడు అంగీకరించక తనకు సకల విద్యలు కావలసిందే నని పట్టు పట్టాడు. ఇంద్రుడు చేసేది లేక అతనికి సకల విద్యలు ప్రసాదించాడు. తన కోరిక తీరిందని గర్వంతో తన తండ్రి వద్దకు వచ్చాడు. తన పాండిత్యంతో ఎంతో మందిని ఓడించాడు.

భారతంలో ఉండేది భూమిపై ఎక్కడైనా ఉంటుంది భారతంలో లేనిది భూమిపై ఎక్కడా లేదు
రోజూ భారతం చదవండి భగవద్ అనుగ్రహం పొందండి

కామెంట్‌లు