సంపూర్ణ మహాభారతము*సరళ వ్యావహారిక భాషలో...!
 వన పర్వము తృతీయాశ్వాసము- 97 వ రోజు
గంధమాధన పర్వతం
ఆ తరువాత ధర్మరాజు తమ్ములతోనూ, ద్రౌపదితోనూ కలసి ఎన్నో ప్రయాసలకోర్చి గంధమాదన పర్వతం చేరుకున్నారు. మార్గం రాళ్ళతోనూ ముళ్ళతోనూ చేరి దుర్గమంగా ఉంది. భీముడు తనకుమారుడైన ఘటోత్కచుని స్మరించాడు. ఘటోత్కచుడు తండ్రి ముందుకు వచ్చి నిలబడ్డాడు. ధర్మరాజు కోరిక మేరకు ఘటోత్కచుడు అందరిని వీపుమీద ఎక్కించుకుని ఆకాశమార్గంలో బదరికావనం చేర్చాడు. రోమశుడు తన మంత్ర మహిమతో ఆకాశమార్గాన బదరికావనం చేరాడు. అందరూ నరనారాయణులు తపస్సు చేసుకుంటున్న ఆశ్రమం చేరారు.
భీముడు ఆంజనేయుని కలుసుకొనుట
ఒకరోజు ద్రౌపది భీముడు గంధమాధన పర్వతచరియలలో విహరిస్తున్నారు. వారి ముందు సహస్రదళ పద్మం గాలిలో ఎగురుతూ వచ్చి పడింది. దానిని చూసి ద్రౌపది ముచ్చట పడింది. అలాంటి పద్మాలు మరికొన్ని కావాలని భీముని కోరింది. ద్రౌపది కోరిన సౌగంధికా పుష్పాలు తెచ్చేందుకు బయలుదేరాడు. అలా వెళుతూ భీముడు సింహనాదం చేసి శంఖం పూరించాడు. ఈ శబ్దాలను అక్కడ ఉన్న హనుమంతుడు విన్నాడు. ఆ వచ్చినది తన సోదరుడు భీముడని గ్రహించాడు. గుహలో నుండి బయటకు వచ్చి అక్కడ ఉన్న చెట్లను పెరికి దారికి అడ్డం వేసాడు. తాను కూడా దారికి అడ్డంగా పడుకుని తోకను విలాసంగా ఆడించసాగాడు. భీముడు అక్కడికి వచ్చి హనుమంతుని చూసి సింహనాదం చేసాడు. ఆ శబ్దానికి హనుమంతుడు కళ్ళు తెరిచి " ఎవరయ్యా నీవు? పెద్దవాడిని, అలసిపోయి పడుకున్న వాడిని పడుకుని ఉంటే ఇలా అరవడం తగునా? అడవిలో ఉన్న పండ్లు ఫలాలు తిని వెళ్ళు ఇలా అరవకు " అన్నాడు హనుమంతుడు. భీముడు " నేను పాండురాజు పుత్రుడను, ధర్మరాజూ తమ్ముడిని. నా నామధేయం భీమసేనుడు. నేను కార్యార్ధినై వెళుతున్నాను. నాకు దారి వదులు " అన్నాడు. హనుమంతుడు " నేను ముసలి వాడిని కదలలేను. నీవే నా తోకను పక్కన పెట్టి నీ దారిన నీవు వెళ్ళచ్చు " అన్నాడు హనుమంతుడు. భీముడు అదెంత పని అని తోకను ఒక్క చేత్తో ఎత్తి పెట్టబోయాడు. తోక కదల లేదు.రెండు చేతులు ఎత్తి పట్టుకుని ఎత్తబోయాడు. అప్పుడూ కదల లేదు. భీముడు అది చూసి ఆశ్చర్య పోయాడు.భీముడు హనుమంతునితో " అయ్యా! మీరెవరో నాకు తెలియదు. కాని మీరు మహాత్ములు. నన్ను మన్నించండి " అన్నాడు. హనుమంతుడు భీమునితో " భీమా! నేను హనుమంతుడిని, నీ అన్నను వాయు పుత్రుడను. నేను రామబంటును. రావణుడు రాముని భార్యను అపహరించగా నేను లంకకు వెళ్ళి సీతమ్మ జాడను తెలుసుకుని రామునికి తెలిపాను. రాముడు రావణుని సంహరించి సీతమ్మను పరిగ్రహించాడు. రాముడు నా సేవలకు మెచ్చి నన్ను చిరంజీవిగా ఉండమని దీవించాడు " అప్పటి నుండి నేను గంధమాధన పర్వతంపై నివసిస్తున్నాను " అని చెప్పాడు. అది విన్న భీముడు సంతోషించి " ఆంజనేయా! నీవు అలనాడు సముద్రాన్ని లంఘించిన రూపాన్ని చూడాలని కోరికగా ఉంది. ఒక్క సారి చూపించవా? " అని అడిగాడు. హనుమంతుడు " భీమా! అది ఎలా కుదురుతుంది. ఆ కాలం వేరు ఈ కాలం వేరు యుగధర్మాలు కృతయుగంలో ఒకలా , త్రేతాయుగంలో వేరేలా, ద్వాపరంలో మరోలా ఉంటుంది. అలాగే కలియుగంలో పూర్తి విరుద్ధంగా ఉండబోతుంది " అన్నాడు.

భారతంలో ఉండేది భూమిపై ఎక్కడైనా ఉంటుంది భారతంలో లేనిది భూమిపై ఎక్కడా లేదు
రోజూ భారతం చదవండి భగవద్ అనుగ్రహం పొందండి

కామెంట్‌లు