'పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలల్లోనే చదివించాలి': -ప్రధానోపాధ్యాయుడు ఈర్ల సమ్మయ్య

లక్షలాది రూపాయల వ్యయంతో ప్రభుత్వ పాఠశాలల్లో సకల సౌకర్యాలు కల్పిస్తున్నారని, అర్హత, విశేష అనుభవం కలిగిన అధ్యాపకుల చేత విద్యాబోధన చేయిస్తున్నారని తల్లిదండ్రులు తమ పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలల్లోనే చదివించాలని 
 రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత, సామాజిక సేవకుడు, ఊషన్నపల్లి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఈర్ల  సమ్మయ్య అన్నారు. బుధవారం ఆయన కాల్వశ్రీరాంపూర్ మండలం ఊషన్నపల్లి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో  భోజన విరామ సమయంలో పిల్లల మధ్యాహ్న భోజనం కోసం ప్రభుత్వం నుంచి వచ్చిన ఉచిత వంట గ్యాస్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఈర్ల  సమ్మయ్య మాట్లాడుతూ  విద్యతోనే సామాజికాభివృద్ధి సాధ్యమవుతుందని,
 ప్రభుత్వ పాఠశాలల్ని బలోపేతం చేయాల్సిన గురుతర బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. పాఠశాలలో పిల్లలకు ప్రత్యేక తరగతులను నిర్వహిస్తూ వారిని ఉన్నతులుగా తీర్చిదిద్దుతున్నామని, సంక్రాంతి పండుగ సెలవుల తర్వాత పాఠశాల పిల్లలకు రీడింగ్, రైటింగ్, డ్రాయింగ్ పోటీలు నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. పాఠశాలలో ప్రీ ప్రైమరీ సెక్షన్ నిర్వహణ కోసం పిల్లలకు రూ. 1.5 లక్షల మెటీరియల్ వచ్చిందని, ఇక్కడ ప్లేవే పద్ధతిలో బోధన చేయిస్తున్నామన్నారు. తల్లిదండ్రులు డబ్బులు వృధా చేసుకోకుండా ఊషన్నపల్లి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలోనే తమ పిల్లల్ని చదివించాలని ఈర్ల సమ్మయ్య కోరారు. తన ఇద్దరు పిల్లల్ని కూడా ప్రభుత్వ పాఠశాలల్లోనే చదివించానని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు.
కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయుడు ఈర్ల సమ్మయ్య, ఉపాధ్యాయినులు మంద శ్రీవాణి, ఎడ్ల స్రవంతి, వంట పనివారు కొత్తపల్లి విజయలక్ష్మి, ధరణి రజిని,  పేరెంట్స్, పైడిపల్లి సతీష్, ధరణి మణికంఠ, స్పెషల్ వర్కర్ పైడిపల్లి విజయలక్ష్మి, పిల్లలు, పలువురు పాల్గొన్నారు. 
కామెంట్‌లు