సంపూర్ణ మహాభారతము-సరళ వ్యావహారిక భాషలో...!
 వన పర్వము చతుర్థాశ్వాసము- 112 వ రోజు
ఉదంకుడి కోరిక
ఆ తరుణంలో ఉదంకుడు బృహదశ్వుని వద్దకు వెళ్ళి " రాజా! నీవు అడవులలో ఉండి తపమాచరించే కంటే ప్రజా రక్షణ చేస్తూ రాజ్య పాలన చేయడం మేలు కదా! అలాగైతేనే సాధువులైన మాకు మేలు అధికం. మధుకైటబుల కుమారుడు దుంధుడు మా ఆశ్రమ సమీపంలో తపస్సు చేస్తున్నాడు. దుంధుడు బ్రహ్మదేవుని మెప్పించి వరాలు పొందాడు. అతడు విడిచేగాలికి రేగే ధూమం వలన మేము అనేక అవస్థలు పడుతున్నాము. కనుక నీవు దుంధుడిని సంహరించి మమ్ములను రక్షించాలి అన్నాడు. విష్ణుమూర్తి కూడా ధుంధుడిని సంహరించడానికి యోగబలం అందిస్తానని చెప్పాడు. నీవు ఆరాక్షసుని సంహరించి మాకు రక్షణ కలిగించాలి " అని కోరాడు. బృహదశ్వుడు " మహాత్మా! దుంధుడిని సంహరించడానికి నా కుమారుని పంపుతాను. నాకు తపో వనాలకు వెళ్ళడానికి అనుజ్ఞ ఇవ్వండి " అని కోరాడు. ఉదంకుడు అందుకు అంగీకరించాడు. ఉదంకుని కోరిక ప్రకారం బృహదశ్వుడు కువలయాశ్వుని ధుంధుడిని సంహరించమని పంపాడు. విష్ణుమూర్తి తన యోగశక్తిని కువలయాశ్వునిలో ప్రవేశ పెట్టాడు. కువలయాశ్వుడు ఇసుక తిన్నెలను తవ్వించి అక్కడ నిద్రిస్తున్న రాక్షసుని నిద్ర లేపారు. అతడు వదిలిన గాలి అగ్నిజ్వాలలై కువలయాశ్వుని ముగ్గురు కుమారులు తప్ప అందరినీ చంపింది. కువలయాశ్వుడు ఆ రాక్షసునితో ఘోరంగా యుద్ధం చేసి చివరిగా బ్రహ్మాస్త్రం ప్రయోగించి రాక్షసుని సంహరించాడు. అప్పటి నుండి కువలయాశ్వుడు దుంధుమారుడుగా పిలువబడ్డాడు. అప్పుడు, ఉదంకుడు, దేవతలు, మహర్షులు కువలయాశ్వుని వరం కోరుకొమ్మని అడిగారు. కువలయాశ్వుడు " మహాత్ములారా ! నాకు ఎల్లప్పుడూ విష్ణు భక్తి, బ్రాహ్మణభక్తి, దానం చేసే శక్తి అనుగ్రహించండి " అని వేడుకున్నాడు. అతను కోరిన వరాలు ప్రసాదించి అందరూ తిరిగి వెళ్ళారు.
మధు కైటబులు
కువలయాశ్వుని వృత్తాంతంలో మధుకైటబుల ప్రస్తావన రాగానే ధర్మరాజు మార్కండేయుని మధుకైటబుల గురించి చెప్పమని కోరాడు. మార్కండేయుడు ధర్మరాజుతో " ధర్మరాజా! ముల్లోకాలు జలమయమై ఉండగా విష్ణుమూర్తి ఆది శేషునిపై నిద్రిస్తూ యోగ నిద్ర లో ఉన్నాడు. కొంత కాలానికి మధుకైటబులనే రాక్షసులు విజృంభించి దేవతలను బాధించి చివరకు విష్ణువు నాభి నుండి ఉద్భవించిన బ్రహ్మదేవుని కుడా బాధించారు. బ్రహ్మదేవుని ఆక్రందనతో యోగనిద్ర నుండి మేల్కొన్న విష్ణువు మధుకైటబుల ఆగడాలను విన్నాడు. విష్ణువు మధుకైటబులను చూసి "మధుకైటబులారా! మీ బలపరాక్రమాలకు మెచ్చాను. ఏమి వరం కావాలో కోరుకోండి " అని అడిగాడు. అందుకు వారు గర్వంతో "మేమే నీకు వరాలు ఇస్తాం ఏమి కావాలో కోరుకో " అని చెప్పారు. విష్ణుమూర్తి మధుకైటబులారా! నేను వరాలు కోరుకుంటున్నాను ఆడిన మాట తప్పక నాచే మృత్యువును పొంది లోకాలకు ప్రీతి కలిగించండి " అన్నాడు. అందుకు వారు "దేవా! మేము ఆడిన మాట తప్పము మేము ప్రాణాలు ఇవ్వడానికి సిద్ధం అయితే జలం లేని చోట మమ్ములను సంహరించండి " అన్నారు. ఆ సమయంలో ముల్లోకాలు జలమయమై ఉన్నాయి కనుక విష్ణువు వారిని తన తొడపై కూర్చుండబెట్టి చక్రాయుధంతో సంహరించాడు.

వన పర్వము చతుర్థాశ్వాసము సమాప్తం

భారతంలో ఉండేది భూమిపై ఎక్కడైనా ఉంటుంది భారతంలో లేనిది భూమిపై ఎక్కడా లేదు
రోజూ భారతం చదవండి భగవద్ అనుగ్రహం పొందండి

కామెంట్‌లు