జ్ఞానోదయం:-కోలా సత్యనారాయణ -విశాఖపట్నం
  అన్నవరం సత్యనారాయణ స్వామి గుడికి ఇంటిల్లిపాది  వెళ్ళాం.   దర్శనం సజావుగా జరిగింది.  తిరిగొస్తూ, ప్రాకారం పై గ్రానైటు పలకపై చెక్కిన దాతలు పేర్లు ఒకసారి చదివాను.   అందులో నా పేరు కూడా ఉంది... "మంగాయమ్మ" అని. ‌‌ ఎప్పుడో 10,000 విరాళం ఇచ్చినట్లు గుర్తు.   గుడి కార్యనిర్వాహక వర్గం నిజాయితీకి అబ్బురపడటమే కాదు... నా ఉల్లం ఉప్పొంగింది.   కారణం... నేనూ ఒక దాతను కదా! 
      అక్కడినుండి ప్రవేశద్వారం వైపు వస్తుంటే ఒక నవ్వు వినిపించింది.  అక్కడ ఎవరూ నవ్వినట్లు ఆనవాళ్లు లేవు.   కానీ ఆ గ్రానైటు పలక నుండి ఆ నవ్వు వచ్చింది అనిపించింది. 
       "ఎందుకలా నవ్వుతున్నావు" అని ఆ రాతి పలకాన్ని అడిగాను. 
      "పదివేల విరాళంతో దేవుడి అనుగ్రహం పొందేయవచ్చని నీ అహంకారం.  దేవుడి కోసం ఎంత విరాళం ఇచ్చావో, పదిమందికి తెలియాల్సిన అవసరం లేదు! దేవుడు నీకోసం ఎంత ఇచ్చాడో ఎప్పుడైనా ఆలోచించావా? ఇదంతా నీ ప్రతిభ అనుకుంటే,   నీ అంత మూర్ఖురాలు ఈ లోకంలో మరొకరు ఉండరు" అంది ఆ రాతి పలకం. 
       గర్భగుడి వైపు తిరిగి వెళ్ళి, దేవుడికి నమస్కరించి, చెంపలు వాయించుకుని, క్షమించమని వేడుకున్నాను.   అలా నాకు జ్ఞానోదయం అయింది. 
         *అయిపోయింది*

కామెంట్‌లు