వన పర్వము పంచమాశ్వాసము*121 వ రోజు
అగ్ని సముద్రములో దాగుట
కార్యభారంతో అలసి పోయిన అగ్ని అధర్వునితో ఇలా చెప్పాడు " యజ్ఞయాగాదులలో సమర్పించే హవిస్సులను దేవతల కందించి నేను అలసి పోయాను. ఇకపై ఆ కార్యాన్ని నీవు నిర్వహించు " అని చెప్పి అగ్ని సముద్రంలో దాక్కున్నాడు. దేవతలందరూ అగ్ని ఎక్కడున్నాడో తెలియక వెదక సాగారు. ఇంతలో సముద్రంలోని చేపలు అగ్ని సముద్రంలో దాక్కుని ఉన్న విషయం దేవతలకు అందించాయి. అగ్నిదేవుడు ఆగ్రహించి " మీ చేపజాతిని మానవులు నిర్ధయులై తినెదరు కాక " అని శపించాడు. దేవతలంతా " అగ్నిదేవా! నీవు యధావిధి మాకు హవిస్సులను అందించు అని అడిగారు " కాని అందుకు అగ్ని సమ్మతించక శరీరాన్ని విడిచి భూమిలో ప్రవేశించాడు. భూమి పై పడిన అగ్ని నుండి అనేక ధాతువులు ఆవిర్భవించాయి. చీము నుండి గంధకం, ఎముకల నుండి దేవదారు వృక్షములు, కఫం నుండి కర్పూరం, పిత్తం నుండి పచ్చలు, వాతము నుండి నల్లటి పాషాణము, గోళ్ళనుండి అభ్రకము, రక్తనాళముల నుండి పగడములు ఏర్పడ్డాయి. అగ్ని దేవుడు భూగర్భంలో తపస్సు చేసుకుంటున్నాడు. అధర్వుడు అగ్ని కార్యములన్నీ నిర్వహిస్తున్నాడు. దేవతలంతా అధర్వుని పూజిస్తున్నారు. అధర్వుని కాంతిని దేవతలు అతనిచే తృప్తి పడటాన్ని ఓర్వలేక అగ్ని బయటకు వచ్చి మరల హవిస్సును అందిస్తానని ముందుకు వచ్చాడు. ధర్మరాజా ఆ విధంగా ఎందరో అగ్నులు ఉన్నాఅందరిలో వెలిగే అగ్ని ఒకటే " అన్నాడు మార్కండేయుడు.
కుమారస్వామి
ధర్మరాజు "మహర్షీ ! మహాసేనాని అని పిలువబడే కుమారస్వామి అగ్నిదేవునికి, కృత్తికలకు, శివునకు కుమారుడెలా అయ్యాడు " అని అడిగాడు.
దేవసేన
మార్కండేయుడు " ధర్మరాజా ! పూర్వం దేవేంద్రుడు రాక్షసులతో యుద్ధం చేసి ఓడి పోయాడు. రాక్షసులను గెలవడమెలా అని దేవేంద్రుడు మానస అనే కొండ మీద ఆలోచించే సమయంలో ఒక స్త్రీ ఆర్తనాదం వినపడింది. దేవేంద్రుడు ఆ స్త్రీని రక్షించాలని వెళ్ళి కేశి అనే రాక్షసుడు ఒక స్త్రీని ఆకాశమార్గంలో తీసుకు వెళ్ళడం చూసాడు. డేవేంద్రుడు తనవజ్రాయుధంతో అతనిని వెంబడించాడు. అతడు తన గధాయుదాన్ని ఇంద్రుని మీద విసరగా ఇంద్రుడు వజ్రాయుధంతో గధను ముక్కలు చేసాడు. కేశి ఆస్త్రీని వదిలి పారిపోయాడు. ఇంద్రుడు ఆ కన్యను చూసి " నీవెవరు? ఈ రాక్షసుడికి ఎందుకు చిక్కావు? " అని అడిగాడు. ఆమె " అయ్యా! నాపేరు దేవసేన, నా అక్క పేరు దైత్య సేన మేము అరిష్టనేమి అనే ప్రజాపతి పుత్రికలము. మేము ఇక్కడ విహరిస్తుండగా ఈ రాక్షసుడు కామచేష్టలతో మమ్ము వేధిస్తున్నాడు. నా సోదరి దైత్యసేనకు అవి నచ్చాయి ఆమె అతనితో వెళ్ళింది. నాకు నచ్చలేదు కనుక నేను వెళ్ళలేదు. అతడు అంతటితో ఆగక తిరిగి వచ్చి నన్ను బలవంతంగా తీసుకు పోతున్నాడు. ఆ సమయంలో తమరు వచ్చి నన్ను రక్షించారు " అని చెప్పింది. ఇంద్రుడు మీ తల్లి మాతల్లి దక్షుని పుత్రికలు. అందు వలన నీవు నాకు సోదరివి. నీకేం వరం కావాలో కోరుకో " అని దేంద్రుడు అడిగాడు. ఆమె " దేవేంద్రా! మా తండ్రి నా చిన్నతనం నుండి నాకు మహా పరాక్రమవంతుడు, కీర్తిప్రతిష్టలు కల వాడు భర్తగా రాగలడని చెప్పాడు. ఆ మాటను మీరు నిజం చెయ్యండి. దేవతలకు రాక్షసులకు గెలువ శక్యం కాని వాడు, భయంకరమైన రాక్షసులను సంహరించే వాడు, ముల్లోకాలను రక్షించే వాడు, నీకు ఇష్టమైన వాడిని నాకు భర్తగా ప్రసాదించు " అని కోరింది. ఆమె మాటలు విని దేవేంద్రుడు " ఈ రోజు అమావాస్య సూర్యచంద్రులు ఏక రాశిలో ఉంటారు. ఇది సూర్యోదయం రౌద్ర ముహూర్తం. అగ్ని మునులు అర్పించిన హవిస్సులను తీసుకుని సూర్య మండలంలో ప్రవేశిస్తున్నాడు. కనుక సూర్యుడు, చంద్రుడు, అగ్ని తేజములతో జన్మించిన వాడు ఈమెకు భర్త కాగలడు " అని అనుకున్నాడు. దేవసేనను తీసుకుని బ్రహ్మ వద్దకు వెళ్ళి దేవసేనకు తగిన భర్తను ప్రసాదించమని కోరాడు. బ్రహ్మదేవుడు " దేవేంద్రా! ఈ కన్యకు గొప్ప వీరుడు భర్త కాగలడు. అతడు దేవసేనకు సేనాధిపతి కాగలడు. నీ కష్టములు తీర్చగలడు " అన్నాడు
భారతంలో ఉండేది భూమిపై ఎక్కడైనా ఉంటుంది భారతంలో లేనిది భూమిపై ఎక్కడా లేదు
రోజూ భారతం చదవండి భగవద్ అనుగ్రహం పొందండి


addComments
కామెంట్ను పోస్ట్ చేయండి