కవితాశిల్పాలు : - గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
అక్షర శిల్పాలు —
ఆలోచనల ఆకాశంలో చెక్కబడిన శిలలు,
పద చిత్రాలు —
భావాల పల్లకీలో విహరించే చిత్తరువులు.

రమణీయ దృశ్యాలు —
కవిత కన్నుల్లో మెరిసే కాంతి కిరణాలు,
కమ్మని రూపాలు —
మనసు మైమరిపించే మాధుర్య మాధవాలు.

రంగుల బొమ్మలు —
స్వప్నాల సంతలో వేలాడే వెలుగుల వర్ణాలు,
సుందర ఆకారాలు —
సృష్టి సౌందర్యానికి సాక్ష్యాలైన సౌమ్యరేఖలు.

ప్రతి బింబాలు —
ప్రకృతీ ముఖంలో ప్రతిఫలించే ప్రేమఛాయలు,
మట్టి ప్రతిమలు —
జన్మభూమి గుండెల్లో మలచుకున్న జీవమూర్తులు.

దేవతా విగ్రహాలు —
అక్షరాల ఆలయంలో అర్చనకై ఆవిష్కరించబడతాయి,
సాహితీ మూర్తులు
కాలానికి కళాత్మక గుర్తులై చరిత్రకు ఎక్కుతారు. 

కవితలు కేవలం పదాలే కాదు —
అవి మదులను దోచే కల్పనాకృతులు,
భావితరాలకు నిర్మించిన
అమరమైన సౌందర్య సాలభంజికలు. 

========================================
(శిల్పాలు- చిత్రాలు, దృశ్యాలు, రూపాలు, బొమ్మలు, ఆకారాలు, ప్రతిబింబాలు, ప్రతిమలు, విగ్రహాలు, మూర్తులు, ఆకృతులు, సాలభంజికలు, శిలలు, చిత్తరువులు)

కామెంట్‌లు