వన పర్వము సప్తమాశ్వాసము- 147 వ రోజు
లంకపై దండెత్తుట
రాముడు సుగ్రీవునితో " సుగ్రీవా! ఇక ఆలస్యం ఎందుకు లంకపై దండెత్తుటకు తగు సన్నాహాలు చెయ్యి " అని చెప్పాడు. సుగ్రీవుడు వానరు లందరికి వర్తమానం పంపాడు. నలు దిక్కుల నుండి వానరాలు కోట్ల సంఖ్యలో తరలి వచ్చారు. గవయుడు, గజుడు, కుముదుడు, సుషేషణుడు కోట్ల కొలది వానరాలతో తరలి వచ్చారు. జాంబ వంతుడు భల్లూక సేనతో తరలి వచ్చాడు. శుభముహూర్తం చూసి రాముడు రావణుని పై దండయాత్రకు బయలు దేరాడు. హనుమంతుడు సేనా నాయకత్వం వహించాడు. అంగదుడు, నీలుడు, నలుడు అతనికి సాయం నిలిచారు. కపి సైన్యం దక్షిణ తీరానికి చేరింది. రాముడు సుగ్రీవునితో " సుగ్రీవా ఈ సముద్రాన్ని దాటే ఉపాయం నువ్వే చెప్పాలి " అన్నాడు. కొంత మంది వానరులు తెప్పలు కట్టుకుని దాటుదాం అన్నారు. రాముడు " ఇన్ని కోట్ల సైన్యం మన సైన్యం లెక్కకు మించి ఉంది. వీరికి సరిపోవు తెప్పలు పడవలు తయారు చేయడం అసాధ్యం. మనం దాటే సమయంలో శత్రు సైన్యం మన సైన్యాలను సముద్రంలో ముంచి వేయడానికి ప్రయత్నిస్తాయి. నేను ఉపవాస దీక్ష వహించి సముద్రుని పూజిస్తాను. అతని సహాయం లేక ఏమీ చేయలేము. సముద్రుడు లొంగక పోతే నా బాణాలతో సముద్రాన్ని ఇంకిస్తాను " అన్నాడు. ఉపవాస దీక్షతో ఆరాధిస్తున్న రామునికి సముద్రుడు ప్రత్యక్షమైయ్యాడు. రాముడు " మాకు ససైన్యంగా దారి ఇవ్వు లేకున్న సముద్రాన్ని ఇంకిస్తాను " అన్నాడు. సముద్రుడు " రామా! నేను నీకు ఎటువంటి ఆటకం కలిగించను. నీవు ఈ రోజు ఇంకిస్తే ఇతరులు ఆ మార్గాన్ని అనుసరిస్తారు. నన్ను వశపరచుటకు ప్రయత్నిస్తారు. అది మంచిది కాదు. కపి వీరులలో నలుడు అనే శిల్పకర్మ ఉన్నాడు. వాని సాయంతో సేతువు నిర్మించండి. నేను దానిని సాగర జలాల్లో మునగ కుండా కాపాడతాను మీరు ఆ సేతువు మీద ప్రయాణించి సముద్రం దాటవచ్చు " అన్నాడు. నలుడు వంద యోజనములు పొడుగు పది యోజనములు వెడల్పున్న ఒక వారధి నిర్మించాడు.
విభీషణుడు రాముని చేరుట
విభీషణునికి రావణుడితో పొసగ లేదు. అతడు లంక నుండి బయటకు వచ్చి శ్రీరాముని శరణు జొచ్చాడు. శ్రీరాముడు విభీషణునికి అభయం ఇచ్చాడు. శ్రీరాముడు వానర సేనలతో విభీషణునితో వారధి దాటి లంకను చేరుకున్నాడు. శ్రీరాముడు త్రికూట పర్వతంపై ఎక్కి లంకకు నాలుగు వైపులా సైనిక శిబిరాలు ఏర్పాటు చేయించాడు. రావణుని గూఢాచారులైన సారణుడు, శకుడు అనే వారు వానర రూపాలు ధరించి వానరులలో కలిసి పోయారు. విభీషణుడు వారిని రామునికి పట్టి ఇచ్చాడు. రాముడు వారికి సైన్యమంతా చూపించి రావణుని వద్దకు పంపాడు. వారు రావణుని వద్దకు పోయి రాముడి సేన అజేయమని గెలువ సాధ్యం కానిదని చెప్పాడు. రావణుడు లంకకు తగిన రక్షణ కల్పించాడు. శ్రీరాముడు అంగదుని పిలిచి " అంగదా! నీవు రావణుని వద్దకు వెళ్ళి సీతను విడువమని చెప్పు . తగిన విధముగా బుద్ధి మతి చెప్పుము " అన్నాడు. అంగదుడు రావణుని కొలువు కూటమిలో ప్రవేశించి " రావణా! సూర్య వంశ సంభూతుడు రాముడు నీతో ఇలా చెప్పమన్నాడు. అడవులలో తపస్సు చేసుకుంటున్న మునులను చంపావు, దేవతాస్త్రీలను బంధించి మహాపరాధం చేసావు ఇవన్నీ ఒక ఎత్తు నీవు నాపట్ల చేసిన అపరాధం ఒక ఎత్తు. నా భార్య సీతను అపహరించి మహాపరాధం చేసావు. ఆమెను నాకు అప్పగించు లేకున్న నాతో యుద్ధం చెయ్యి. నీకు మరొక మార్గం లేదు. నీకు మానవులంటే చులకన భావం ఉంది రాక్షసకులం అన్నది లేకుండా చేస్తాను జాగ్రత్త " అని అంగదుడు రాముడు చెప్పమన్నది చెప్పాడు. రావణుడు కను సైగ చేయగానే కొంతమంది రాక్షసులు అంగదుని పట్టు కోవడానికి వచ్చారు. అంగదుడు పైకి ఎగిరి వారిని కిందకు తోసాడు. ఆ తోపిడికి వారు మరణించారు. తరువాత అంగదుడు రాముని వద్దకు పోయి జరిగినది చెప్పాడు.
భారతంలో ఉండేది భూమిపై ఎక్కడైనా ఉంటుంది భారతంలో లేనిది భూమిపై ఎక్కడా లేదు
రోజూ భారతం చదవండి భగవద్ అనుగ్రహం పొందండి


addComments
కామెంట్ను పోస్ట్ చేయండి