కులం పునాదుల మీద నిర్మించబడ్డ కుళ్ళు సమాజాన్ని
కూకటి వేళ్ళతో కూలదోయడం
ఆకాశానికి నిచ్చెన వేయడమే..
మానవులంతా ఒక్కటే అన్న
సర్వ మానవ సౌభాతృత్వం అది ఒక కల..
అది కాలం చెల్లిన నినాదమై
మత ఛాందస వాదం మండిపోతోంది.
మానవత్వం మంట గలుస్తూంది.
మానవుడు పురోభివృద్ధి వీడి
తిరోగమన దిశలో దూసుకెళుతున్నడు
స్వార్థంతో చిన్న ప్రపంచాన్ని
సృష్టించుకుంటున్నడు..
విశాల హృదయం
విషంతో నిండిపోయింది
విశ్వాన్ని గెలవాలే అనే
వింత కోరిక మనిషిని మృగాన్ని చేస్తుంది.
ప్రజలను విడదీసి పాలించడమే
నయా కౌటిల్యులు రాజనీతి.
గెలవడమే పరమావధి
మెజారిటీ అది ఓ జిమ్మిక్కు
కులం, మతం, ప్రాంతం వారిగా
విడదీసి గెలవడమే చాణక్య నీతి.
ప్రజాస్వామ్యం అది హుళక్కి..
మతం అభిమతం మారి
మారణహోమం సృష్టిస్తూంది
సమ్మతం లేని సామరస్యత
సమాజానికి పట్టిన చీడ..
కులం హద్దులు దాటి
స్వారీ చేస్తూంది..
మతం సరిహద్దులు దాటి
విద్వేషం చిమ్ముతుంది..

addComments
కామెంట్ను పోస్ట్ చేయండి