వన్నెల వైభవం: - గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
 నీలి ఆకాశం నవ్వితే —
మనసుల్లో నీలిమ నింపుతుంది,
అపారమైన ఆ విశాలతలో
ఆశల పక్షులను ఎగరేస్తుంది.

సప్తవర్ణాల హరివిల్లు మెరిస్తే —
ప్రకృతి కుంచె రంగులు చిందిస్తుంది,
వానబిందువుల వీణపై
రంగుల రాగాలు ఆలపిస్తాయి.

పచ్చని చెట్లు పలికితే —
పృథ్వి ఒడిలో జీవం మొలుస్తుంది,
చిగురుల చప్పుళ్లలో
ప్రకృతి నవ్వులు వినిపిస్తాయి.

రంగుల పూలు విరిసితే —
సువాసనల సందేశాలు పంచుతాయి,
మౌనంగా వికసిస్తూ
మనసులకు మధురానుభూతులు అందిస్తాయి.

తెల్లని వెన్నెల పరచుకుంటే —
రాత్రి ముద్దుగా మెరిసిపోతుంది,
చంద్రకాంతి చీర కప్పుకొని
ప్రపంచం ప్రశాంతంగా నిద్రపోతుంది.

బులుగు సముద్రం ఉప్పొంగితే —
అలల ఆటలలో సంగీతం పుడుతుంది,
అపారమైన ఆ గర్భంలో
అనేక రహస్యాలు దాచుకుంటుంది.

సింధూరపు బొట్టు మెరిసితే —
భారత నారి గౌరవం వెలుగుతుంది,
ఒక చిన్న ఎర్రబిందువులోనే
సంస్కృతి సౌందర్యం నిలుస్తుంది.

మువ్వన్నెల జండా ఎగిరితే —
భారత హృదయం గర్వంగా కొట్టుకుంటుంది,
కేసరి, తెలుపు, పచ్చ రంగుల్లో
జాతి ఆత్మ గాథ మెరిసిపోతుంది.

రంగుల ఈ లోకంలో —
ప్రకృతి చిత్రమే జీవితం,
ప్రతి రంగులో ఒక భావం,
ప్రతి క్షణంలో ఒక సౌందర్యం.

రండి — రంగుల్లో మునుగుదాం,
వర్ణాల్లో తేలుదాం;
చాయలలో సంచరిద్దాం,
వన్నెలలో వెలుగుదాం.


కామెంట్‌లు