కలాల కూర్పులు: - – గుండ్లపల్లి రాజేంద్ర ప్రసాద్, భాగ్యనగరం.
కలాలు అల్లిన పదునైన అక్షరాలు —
పగిలిన మౌనాలను పలికిస్తాయి,
నిద్రలో ఉన్న నిజాలను
నిగర్విగా నిలబెడతాయి.

కలాలు వాడిన పదునైన పదాలు —
పొరలైన అబద్ధాలను తొలగిస్తాయి,
మాయమాటల ముసుగులను
మెల్లగా చీల్చి చూపిస్తాయి.

కలాలు తెలిపిన పదునైన భావాలు —
మనసుల మర్మాలను తడిమేస్తాయి,
నిర్లిప్తంగా నిలిచిన హృదయాల్లో
నిజం మంటలు రాజేస్తాయి.

కలాలు వదిలిన పదునైన మాటలు —
సమాజపు మలినాలను కడుగుతాయి,
సత్యపు కాంతిని
సర్వదిక్కులా పరచుతాయి.

కలాలు కూర్చిన పదునైన రాతలు —
కాలపు చెక్కిళ్లపై చెక్కుతాయి,
కాలుష్యపు గోడలపై
కవిత్వపు కిరణాలు చిమ్ముతాయి.

కలాలు పేర్చిన పదునైన కవనాలు —
చీకట్ల గుండెల్లో వెలుగు నాటుతాయి,
మనుష్యత్వం మళ్లీ మొలిచేలా
మనసుల నేలను మేల్కొలుపుతాయి.

కలాలు కదిలితే —
కుర్చీలు కూడా కదులుతాయి,
కలాలు పదునెక్కితే —
కప్పుకున్న ముసుగులు జారిపోతాయి.

కలాలు కురిస్తే —
అబద్ధాల మేడలు కూలిపడతాయి,
కలాలు మెరిస్తే —
నిజాలే నిత్యంగా నిలిచిపోతాయి.

కలం వ్రాతలు కళ్ళను కట్టిపడేస్తాయి,
కలం చేతలు కనువిప్పు కలిగిస్తాయి;
కలం మోతలు కర్ణాలకు కమ్మదనమిస్తాయి,
కలం పోతలు కలనామృతం కురిపిస్తాయి.


కామెంట్‌లు