ఉద్యోగ పర్వము ప్రథమాశ్వాసము-201 వ రోజు
సేనలసమాయత్తం
సాత్యకి ఒక అక్షౌహిని సేనతో పాండవుల వద్దకు వచ్చాడు. చేధి దేశాధీశుడు, శిశుపాలుని కుమారుడు దృష్టకేతు , జరాసంధుని కుమారుడు సహదేవుడు ఒక్కొక్క అక్షౌహిని సేనతో వచ్చి కలిసారు. కేకయ రాజులు కూడా ఒక్క అక్షౌహినితో కలిసాడు. ద్రుపదుడు బంధువులతో ఒక్క అక్షౌహినితో కలిసాడు. పర్వత రాజు ఒక్క అక్షౌహినితో కలిసాడు. విరాట రాజు తన సైన్యముతో కలిసాడు. పాండ్యరాజు ఒక్క అక్షౌహినితో కలిసాడు. ఇలా పాండవ సైన్యం ఏడు అక్షౌహినులైంది. ఇక సుయోధనుడు కూడా తన సైన్యాన్ని సమాయత్తం చేస్తున్నాడు. భగదత్తుడు ఒక్క అక్షౌహినితోను, కాంభోజరాజు సుదక్షిణుడు ఒక్క అక్షౌహినితోను, భూరిశ్రవుడు ఒక్క అక్షౌహినితోనూ, శల్యుడు ఒక్క అక్షౌహినితోను, సింధురాజు జయద్రధుడు ఒక్క అక్షౌహినితోనూ, మాహిష్మతీపతి నీలుడు ఒక్క అక్షౌహినితోనూ, యాదవరాజు కృతవర్మ ఒక్క అక్షౌహినితోను, అవంతీరాజులు విందాను విందులు తలా ఒక్క అక్షౌహినితోనూ , వివిధదేశముల నుండి వచ్చిన సైన్యం మూడు అక్షౌహినులయ్యాయి. మొత్తం పదకొండు అక్షౌహినుల సైన్యం కౌరవపక్షాన చేరింది.
ద్రుపదరాజు పంపిన పురోహితుని రాయభారం
ద్రుపదరాజు పంపిన పురోహితుడు హస్థినకు చేరాడు. అతడు భీష్ము, ద్రోణ, కృపాచార్యు, విదుర దుర్యోధనాధులను కలుసుకున్నాడు. మరునాడు దృతరాష్ట్రసభలో " ధృతరాష్ట్రుడు, పాండురాజు అన్నదమ్ములు. వారి పుత్రులైన కౌరవ, పాండవులకు రాజ్యంపై సమాన హక్కు ఉందని మీకంతా తెలుసు. పాండవులను చంపడానికి చేసిన అనేక ప్రయత్నాలు వాటి నుండి వారు తప్పించుకున్న విధం మీకు తెలుసు. పాండవులు తమ బాహు బలంతో నూతన రాజ్యాన్ని స్థాపించి, వృధి చేసిన రాజ్యంను శకునితో కలిసి కుట్రపన్ని జూదం వంకతో దుర్యోధనుడు అపహరించిన విషయం మీకు తెలుసు. వీటిని అంగీకరించిన దృతరాష్ట్రుని ఏమనాలి. పాండవపత్నిని సభలో వలువలు వలిచి అవమానించిన విషయం, వారి రాజ్యం అపహరించిన విషయం ఎలా మరువగలము. నాటి నిర్నయానుసారం ఇప్పుడు వారు అరణ్య అజ్ఞాత వాసాలు ముగించుకుని మునుపటి తప్పులను తలంచక వారి రాజ్యభాగం కోరుతూ సంధి నిమిత్తం నన్ను పంపారు. కౌరవ, పాండవ ప్రవర్తను ఎరిగిన మీరు దుర్యోధనుడికి నచ్చ చెప్పటం మంచిది. పాండవులు బల హీనులు కారు. జననష్టం లేకుండా తమ రాజ్యంను పొందాలనుకుంటున్నారు. వారి వైపు ఏడు అక్షౌహినుల సైన్యమే ఉంది, మా వద్ద పదకొండు అక్షౌహినుల సైన్యం వుందని అనుకుంటున్నారేమో సాత్యకి, భీముడు ఒక్కొక్కరు వెయ్యి అక్షౌహినులకు సమం. అర్జునిని ఎదిరించి నిలువగలిగిన వీరుడు ముల్లోకాలలో లేడు. అన్నిటికి మించి చతురోపాయములో సమర్ధుడైన శ్రీకృష్ణుడు వారి వైపు ఉండగా వారిని విజయలక్ష్మి వరించకుండా ఉండ కలదా? వారిని పిలిపించి వారి రాజ్య భాగం ఇప్పించి అందరూ క్షేమంగా సుఖంగా ఉండండి " అని చెప్పి కూర్చున్నాడు.
*రేపు *
భారతంలో ఉండేది భూమిపై ఎక్కడైనా ఉంటుంది భారతంలో లేనిది భూమిపై ఎక్కడా లేదు
రోజూ భారతం చదవండి భగవద్ అనుగ్రహం పొందండి

addComments
కామెంట్ను పోస్ట్ చేయండి