మాటల మంత్రము – భావాల మాధుర్యము: -గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం.
వెలుగులు విరజిమ్మమంటారు—
వెలుతురు విత్తనాలను వెదజల్లమంటారు;
చీకటి చెరగాలంటే
చిరు జ్ఞాన దీపాల్ని వెలిగించమంటారు॥

వెన్నెలజల్లు కురిపించమంటారు—
వేదనల వేడి తగ్గించమంటారు;
మనసు మైదానాల్లో
మధుర స్వప్నాల్ని నాటమంటారు॥

చిరునవ్వులు చిందమంటారు—
చిరు ఆనందాల్ని పంచమంటారు;
వేదనల వర్షంలోనూ
వేడుకల్ని సమకూర్చమంటారు॥

పువ్వులు పూయించమంటారు—
పదాల తోటల్లో రంగులు చూపమంటారు;
భావాల కొమ్మల్లో
బంగారు కవితలు విరపూయించమంటారు॥

పరిమళాలు చల్లమంటారు—
ప్రేమ గాలిలో పులకింతలు కలపమంటారు;
మనసుల మడుల్లో
మాధుర్యపు మల్లెలు నింపమంటారు॥

అందాలు చూపమంటారు—
అక్షరాల్లో ఆత్మ సౌందర్యం ప్రతిఫలింపజేయమంటారు;
చూపుల చెరువుల్లో
చైతన్య చంద్రికను తేలియాడించమంటారు॥

ఆనందాలు అందించమంటారు—
అనుభూతుల అంచుల్లో ఆహ్లాద తరంగాలు రేపమంటారు;
జీవిత జలధిలో
జీవన గీతాలు వినిపించమంటారు॥

కవితలు అల్లమంటారు—
కాలపు కడలిలో కవన కెరటాలు లేవదీయమంటారు;
అక్షరాల ఆభరణాలతో
అంతరంగాలను అలంకరించమంటారు॥

మనసులు దోచమంటారు—
మాటల మంత్రంతో మానవ హృదయాలు గెలువమంటారు;
ప్రేమ పరిమళంతో
ప్రపంచాన్ని పూలవనంగా మార్చమంటారు॥

ఇలా అంటారు అందరూ—
కాని కవి గుండె మాత్రం చెబుతుంది—
"నేను కాదు వెలుగుల వర్షం,
మీ హృదయాలే నా కవితకు అసలు మూలం" 


కామెంట్‌లు