లంబాడీ గిరిజనుల ఉద్యమాల సూర్యుడు.. జాటోత్ ఠాను నాయక్... రాథోడ్ శ్రావణ్ రచయిత ఉపన్యాసకులు ఉట్నూర్ ఆదిలాబాద్ జిల్లా
 పోరాట యోధుడు
ఠాను నాయక్ వీరుడు 
నిజాంను వణికించిన
లంబాడీ గిరిజనుడు
వారెవ్వా! ఠాను నాయకుడా
లంబాడీ గిరిజనుల దేవుడా
ఠాను నాయక్ వీరత్వానికి మారు పేరు. భయం తేలియని గొప్ప వీరుడు. వరంగల్ జిల్లాలోని జనగామ తాలూకాలో విసునూరు దొరలను,నిజాం నవాబులను మూడు చెరువుల నీళ్ళు తాపించిన గిరిజన లంబాడీ బిడ్డ.తుపాకీ గుండ్లకు ఎదురు నిలిచి పోరాడిన పోరాట యోధుడు. నిజాం నిరంకుశ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆంధ్రమహాసభ, కమ్యూనిస్టు పార్టీ నాయకత్వంలో తిరుగుబాటు చేసిన యుద్ధ నిపుణుడు. భూమి కోసం, భుక్తి కోసం, వెట్టిచాకిరి విముక్తి కోసం విసూనూరు దేశ్ ముఖ్ గుండాలను, నిజాం రజాకార్లను ఎదురించిన ధైర్యశాలి. అతడి  పోరాటాలను చూసి చలించిపోయిన పోయిన నిజాం ప్రభుత్వం. ధర్మపురం తాండ పోరు గడ్డను దాస్య సృంకలాల నుండి విముక్తి చేసి అమరుడైన లంబాడీ గిరిజనుల కొదమ సింహం జాటోత్  ఠాను నాయక్.
20 వ.శతాబ్దం భారత దేశ‌చరిత్రలో వీరత్వంలో,త్యాగంలో తెలంగాణా రైతాంగ పోరాటానికి మరేదీ సాటి రాదు.  ఈ ఉద్యమం మొదటి దశలో వెట్టిచాకిరి, భూస్వాముల అక్రమ వసూళ్లుకు వ్యతిరేకంగా జరిగింది. రెండో దశలో నిజాంకు వ్యతిరేకంగా, భూస్వాములకు, వ్యతిరేకంగా అనేక సాయుధ పోరాటాలు జరిగాయి. హైదరాబాద్ సంస్థానంలోని  తెలంగాణ ప్రాంతంలో 1941 నుండి 1951 వరకు దాదాపు పది సంవత్సరాలు వరంగల్ జిల్లాలో జనగామ తాలూకా కేంద్రంగా  తెలంగాణా సాయుధ రైతాంగ పోరాటం జరిగింది. కమ్యూనిష్టు పార్టీ నాయకత్వంలో భూమి కోసం ఏభుక్తి కోసం, తెలంగాణాలోని వెట్టిచాకిరి విముక్తి కోసం జాటోత్  ఠాను నాయక్ 
నాయకత్వంలో  పోరాటం జరిగింది.దొరలు, రజాకార్లు 
లంబాడీ గిరిజనుల శతాధిక  ఎకరాల భూములు తీసుకొని వారిచే దోపిడి, వెట్టిచాకిరి చేయించుకోవడం,బలవంతంగా వారి భూములు లాక్కొవడం వారిని బానిసలుగా,కులీలుగా మార్చడం జరిగింది.లంబాడీ గిరిజనులచేత  తమ పొలాల్లో, ఇళ్ళల్లో వెట్టి పనులు చేయించుకునే వారు.వారిచేత అన్ని రకాల పనులు చేయించి కులీ డబ్బులు, జీతం డబ్బులు, పూర్తిగా ఇవ్వకుండా ఎంతో కొంత ఇచ్చి ఇచ్చిన దానిపై వడ్డీ, భూమి శిస్తు ఎక్కువగా రాసుకొనే వారు ఆవిధంగా వారి అప్పులు తీరిక పోయేది. చేసెది ఏమీ లేక విసుగు చెందిన గిరిజన లంబాడీలు
 దున్నేవానికే భూమి కావాలని అనే నినాదంతో రైతాంగ సాయూధ పోరాటం ప్రారంభించారు. ఈ సాయూధ పోరాటంలో లంబాడీల పోరాటం వీరోచితమైనది
 అని చెప్పవచ్చు.రజాకార్లు, దొరలు తుపాకులు, మందుగుండు సామగ్రి, బాంబులు, కత్తులు,జంబువాలతో తెల్లని గుర్రాల పై  స్వారీ చేస్తూ తాండల పై దాడికి పాల్పడ్డేవారు.వరంగల్ జిల్లా దేవరూప్పల మండలంలోని మొండ్రాయి, ధర్మవరంతాండ  పై జాటోత్ ఠాను నాయక్ మరియు వారి  కుటుంబం యొక్క నాయకత్వంలో తాండ చూట్టు ఉన్న  దాదాపు ఏడు ఎనిమిది సమీప తాండ వాసులు వీరి ఆగడాలను అరికట్టడానికి పోరాటంలో పాల్గొనడానికి సంసిద్ధం అయ్యారు. వీరు  ఠాను నాయక్ ,అన్నా జోద్యా నాయక్ నాయకత్వంలో  రహస్య సమావేశం ధర్మవరపు తాండలో నిర్వహిస్తూన్నట్లు కుసూనురు  రామచంద్రరెడ్డి కుమారుడు  బాబుదొర, నిజాం రజాకార్లు  గుర్తించారు. ఈ నేపథ్యంలో ఉద్యమ వెలుగులోకి వచ్చిన కామ్రేడ్  జాటోత్ ఠాను నాయక్.  
తెలంగాణ రాష్ట్రంలో వరంగల్  జిల్లా దేవరుప్పుల మండలంలోని ధర్మాపురం పడమటి తాండలో
  శ్రీమతి/ శ్రీ  జాటోత్ హము నాయక్, మంగిబాయి  లంబాడీ గిరిజన  దంపతులకు జాటోత్ ఠాను నాయక్ జన్మించారు.ఠానూ నాయక్ కు ఐదుగురు అన్నదమ్ములు ఠానూ నాయక్ నాల్గో సంతానము. పెద్దవాడు జాటోత్  జోద్యానాయిక్, సోమ్లా నాయక్, సక్రూ నాయక్,ఈ ముగ్గురు ఠానూ నాయక్ కంటే పెద్దవారు. దర్యా నాయక్, కిషన్ నాయక్, ఇద్దరు ఠానూ నాయక్ కంటే చిన్నవారు.ఠానూ నాయక్ వదినమ్మ పేరు జాటోత్ ఫూలిబాయి.ఫూలిబాయి విసునూరు దొరలపై కడవెండికి చెందిన దొరసాని జానకమ్మ  పై వీరత్వాన్ని ప్రదర్శించిన వీరనారి జోద్యా నాయక్ సతీమణి జాటోత్ ఫూలిబాయి.వీరి బంధుమిత్రులు జాటోత్ రెడ్యా, అజ్మేర బలరామ్, అజ్మేర  చంద్రునాయిక్, రాము నాయక్,బోడా గోల్యా నాయక్, థావుర్యా నాయక్,ధారావత్ కీషన్ నాయక్,జాటోత్ థావురు మొదలగు వారు ఠానూ నాయక్ కుటుంబానికి చేదోడువాదోడుగా ఉండేవారు.ఆపద్కర పరిస్థితిలో సహచరులుగా  ఉండి సహాకరించే వారు.
హైదరాబాద్ సంస్థానం భారతదేశంలో చాలా పెద్ద సంస్థానము.1911 నుండి 1948 వరకు అసఫ్ జాహి వంశానికి చెందిన ఏడవ నిజాం పేరు మీర్ ఉస్మాన్ అలీఖాన్ పరిపాలించేవాడు.నిజాం నియంతృత్వ రాజరిక పాలన ఉండేది.వంశపారంపర్యంగా పదవులు పొందిన పటేల్లు, పట్వారీలు, దొరలు, దేశ్ ముఖ్ లు,దేశ్ పాండేలు, జమిందారులు,వతన్దారులు,జాగీర్ధారులు నిరుపేద రైతుల భూములను తమపలుకుబడితో ఆక్రమించుకొనేవారు.కొన్ని సంవత్సరాల వరకు వారిచే బానిస పనులు చేయించుకునే వారు.వారిలో వరంగల్ జిల్లాలోని ధర్మపురం  జమిందార్ వేమురి రాఘవరావు, జనగామ జమిందార్ విసునూరు రామచంద్ర రెడ్డి, మొండ్రాయి జమిందార్ కటారు రామచంద్ర రావు  దొరలకు ముఖ్యులు.ఈ
జమిందార్ల ఆగడాలను అరికట్టడానికి కమ్యూనిస్టు పార్టీ నాయకత్వంలో లంబాడీలు వ్యతిరేకంగా తిరుగుబాటు ప్రారంభించారు. వారిలో ఠానూ నాయక్ కుటుంబం చేసిన త్యాగం తెలంగాణ చరిత్రలో స్వర్ణ అక్షరాలతో లిఖించిబడినది.ఇందులో
విసునూరు దేశ్ ముఖ్ కటారు రామచంద్ర రావు లంబాడీ గిరిజనుల పై ముఖ్యంగా ఠానూ నాయక్ కుటుంబం పై చేసిన చిత్ర హింసలు, దౌర్జన్యాలు, అత్యాచారాలు, అరాచకాలు అంతో ఇంతో కాదు.  తమ అమ్మాయిలను అక్కాచెల్లెళ్ళులను దొరల ఇంటికి పని చేయడానికి పంపే దురాచారాన్ని వ్యతిరేఖంగా ఠానూ నాయక్,అతని పెద్దన్న జోద్యా నాయక్ ఆంధ్రమహాసభలో సభ్యులు చేరి పుచ్చలపల్లి సుందరయ్య గారి సహాయ సహకారంతో  దోరల పై పోరాటం ఉధృతం చేసినారు. 
రామచంద్ర రెడ్డి కొడుకు బాబుదోర  ఒక రోజు గుండాలతో తాండకు వచ్చి తాండా  గుడిసెలను నిప్పు పెట్టి  అగ్నికి ఆహుతి చేసినారు. ఠానూ నాయక్ అన్న సోమ్లా నాయక్ అతనితో సహా మొత్తం ఐదుగురిని గుండాల సాహాయంతో  మండుతున్న అగ్నిలో సజీవ ధానం చేసి వేళ్ళి పోయారు. కొన్ని రోజుల తర్వాత మళ్ళీ బాబుదొర తాండ ప్రజలను హింసించడం మొదలుపెట్టాడు. గుండాలతో  రజాకార్లతో  మధ్యాహ్నం సమయంలో తాండలో ప్రవేశించి తాండ రైతులు  పోలం పనులకు వెళ్ళటం గమనించి 65 సంవత్సరం పై బడిన ఆడమగ ముసలి వాళ్ళును ఒక దగ్గర చేర్చి బట్టలు విప్పించి అందరినీ నగ్నంగా చేసి మూత్రం తాగించి హింసించడం మొదలుపెట్టాడు. ఈ దృశ్యాన్ని కళ్ళరా చూసిన ఠానూ నాయక్ వదినమ్మ జాటోత్ ఫూలిబాయి అందరికి రహస్య సమాచారం ఇచ్చి తాండ వాసులను  పిలపించి అందరినీ ఏకం చేసి ఆడవాళ్ళు కారం పొడితో  మగవాళ్ళు  వడెసరాళ్ల, వడెసతో  దొరల గుండాల పై తిరుగుబాటు ప్రారంభించారు.ఒక్కోకరికి ఆడవాళ్ళు కళ్లో కారం పొడి చల్లి గేదుముతు కొట్టుకుంటూ కోడవళ్ళతో  బట్టలు చించేసి  గుండాలును తరిమి కొట్టారు. ఇందులో క్రియాశీలక పాత్ర పోషించారు వీరనారి జాటోత్  ఫూలిబాయి ఈ విషయం  నలుమూలల వ్యాపించి ప్రజల్లో చైతన్యాన్ని కలగించింది.
జాటోత్ ఠానూ నాయక్  మధ్యతరగతి లంబాడీ గిరిజన కుటుంబానికి చెందినవాడు. చదువు కోలేదు నిరక్షరాస్యుడు.  కానీ  చాలా తెలివి తేటలు గలవాడు.అతని తెలివి తేటలను గమనించి కమ్యూనిస్టు నాయకులు ఠానూ నాయక్ కుటుంబానికి అండగా నిలిచారు.
దొరలు,రజాకార్ల పెత్తనాన్ని,  ధైర్యంగా ఎదిరించి పోరాడే వాడు ఠానూ నాయక్. తన కుటుంబానికి,తన సమాజానికి అడుగడుగునా జరుగుతున్న అన్యాయాన్ని సహించలేక ఉద్యమ బాట పట్టారు ఠానూ నాయక్.
1940 వరంగల్ జిల్లా
 జనగామ తాలుకా లోని ధర్మాపురం తాండ, మొండ్రాయిలో మక్తేదారులు లంబాడీ రైతులు సాగుచేస్తున్న 105 ఎకరాల విస్తీర్ణం గల భూమిని కబలించడాని తీవ్ర ప్రయత్నాలు చేసారు. కాని సమీప తాండవాసులందరు  ఐక్యంగా ఉద్యమించడంతో భూస్వాముల ప్రయత్నం విఫలమైంది.కొన్ని నెలల గడిచిన తర్వాత దేశముఖ విసునూరు రామచంద్రా రెడ్డికి సంబంధించిన గుండాలు ఠానూ నాయక్ కుటుంబం సభ్యులను హతమార్చాలని ఉపాయం పన్నారు. ఈ బాధ్యతలు విసునూరు దేశ్ ముఖ రామచంద్రారెడ్డి కుమారుడు జగన్ మోహన్ రెడ్డికి ( బాబుదొర) అప్పగించారు. బాబుదొర గుండాల సహాయంతో ధర్మపురంతాండకు చుట్టు ముట్టారు. మరోవైపు రజాకార్లు తాండను ముట్టడించి ఠాను నాయక్ ను పట్టుకునేందుకు తాండ పై దాడులు  నిర్వహించారు. భూస్వాములు కమ్యూనిస్టు స్థావరాల పై గుండాలతో దాడులు ప్రారంభించారు. ఠాను నాయక్ ఆచూకీ తెలపాలని తండ్రి హమును కొట్టి కేసులు చిత్ర హింసలకు గురిచేశారు.అన్నా  జోద్యా నాయక్, సక్రు నాయక్ పై అక్రమ కేసుల్లో ఇరికించి వరంగల్ జిల్లా జైలులో పంపారు. తండ్రి చెప్పక పోవడంతో 
కాళ్ళు చేతులు విరగోట్టి చూస్తుండగానే తాండను దహనం చేశారు. ధర్మాపురం తాండలో గుడిసెలను వేసుకొంటుండగా 
 సోమ్లా నాయక్,జాటోత్ రెడ్డ్యా నాయక్ ,గోల్యా నాయక్,చంద్రూ నాయక్ , అజ్మేర బలరామ్ నాయక్,థావురు నాయక్, మొదలగు వారిని మండుతున్న గుడిసెలోనే దేశ్ ముఖ్ గుండాలు
 సజీవదహనం చేశారు.మరికొందరిని గుట్టల్లో తీసుకెళ్లి తుపాకీతో కాల్చి చంపారు. దేశ్ ముఖ్ గుండాలు, పోలీసులు, రజాకార్లు నుంచి ఎన్నో సార్లు తప్పించుకుని తిరుగుతున్న జాటోత్ ఠానూ నాయక్ ను ఒక తెలంగాణ ద్రోహి అందించిన సమాచారంతో ఎట్టకేలకు మొండ్రాయి  ప్రాంతంలో 
పోలీసులకు చిక్కారు.ఎంతో కష్టంతో పట్టుకొని గడిలో బంధించి కఠినమైన చిత్రహింసలకు గురిచేసిన అదరలేదు బెదరలేదు దళ సమాచారం చెప్పలేదు.
 అతని ధైర్యాన్ని చుస్తు సైనికులు విస్తుపోయారు. చివరికి విసునూరు దేశ్ ముఖ్  బాబుదొర గుండాలు, కటారు నర్సింగ్ రావు  మొండ్రాయిలో పోలీస్ క్యాంపు ఉండగా
ఠానూ నాయక్ ను ఎడ్లబండి చక్రాన్ని కట్టెసి బండిని నడుపుతూ తుపాకీతో కాల్చారు. ఆ పోరాట యోధుడు 1950 మార్చి 20న వీరమరణం పొందారు. అప్పటి నుండి ప్రతి సంవత్సరం మార్చి 20 తేదిన నాయక్ వర్థంతి నిర్వహిస్తు శ్రద్ధాంజలి ఘటించి నివాళులు అర్పిస్తున్నారు.
(వ్యాసకర్త ఉట్నూరు సాహితీ వేదికకు పూర్వ అధ్యక్షులు, లెక్చరర్ ప్రభుత్వ జూనియర్ కళాశాల ఇంద్రవెల్లి ఆదిలాబాద్ జిల్లా తెలంగాణ)
రాథోడ్ శ్రావణ్,9491467715

కామెంట్‌లు