ప్రభుత్వ పాఠశాలల్ని మరువద్దు -రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత ఈర్ల సమ్మయ్య
 బడిబాటలో పిల్లల సందర్శన 
=======================
 ప్రభుత్వ పాఠశాలల్లోనే ఉచిత నాణ్యమైన విద్యను అందిస్తున్నామని, పిల్లల తల్లిదండ్రులు వేలాది రూపాయల డబ్బులు వృధా చేసుకోకుండా తమ పిల్లల్ని ఎస్సీ కాలనీ ఇంగ్లీష్ మీడియం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలోనే చేర్పించాలని కాల్వశ్రీరాంపూర్ మండల కేంద్రంలోని ఎస్సీ కాలనీ ఇంగ్లీష్ మీడియం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు, రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత ఈర్ల సమ్మయ్య కోరారు. గురువారం ఆయన   టీచర్లతో కలిసి ఆయన బడిబాట కార్యక్రమంలో భాగంగా పిల్లల ఇండ్లను సందర్శించారు. బడీడు పిల్లల ఇండ్లకు వెళ్లి వారు ఎస్సీ కాలనీ ప్రభుత్వ పాఠశాల ప్రత్యేకతలను వివరిస్తూ కర పత్రాలను పంపిణీ చేశారు. తమ పిల్లల్ని ఎస్సీ కాలనీ ప్రభుత్వ పాఠశాలలో చెప్పించాల్సిందిగా ఆయన తల్లిదండ్రుల్ని కోరారు. అనంతరం ఈర్ల సమ్మయ్య మాట్లాడుతూ కన్నతల్లిలాంటి  ప్రభుత్వ పాఠశాలల్ని మరువద్దని, పేద, ధనిక, కుల, మత, వర్గ భేదాలు లేకుండా ప్రతి ఒక్కరూ ప్రభుత్వ పాఠశాలల్లో తమ పిల్లల్ని  చేర్పించి, వాటి బలోపేతానికి కృషి చేయాలన్నారు. తల్లి దండ్రులు తమ కష్టార్జితాన్ని వృధా చేసుకోకూడదని, ఫీజుల రూపంలో ప్రతి ఏటా చెల్లించే లక్షలాది రూపాయల్ని బ్యాంకులో పిల్లల పేరున జమ చేయాలని ఆయన సూచించారు. సకల సౌకర్యాలతో పాటు, అందమైన, ఆకర్షణీయమైన పక్కా భవనాలు కలిగిన ఎస్సీ కాలనీ ఇంగ్లీష్ మీడియం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఒత్తిడిలేని నాణ్యమైన విద్యను అందిస్తున్నామని, తల్లిదండ్రులు తమ పిల్లల్ని ఎస్సీ కాలనీ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలోనే చేర్పించి, వారి బంగారు భవిష్యత్తుకు బాటలు వేయాలాన్నారు. 
 ఎస్సీ కాలనీ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో పిల్లలకు ఉచితంగా పాఠ్య పుస్తకాలు, 2 జతల డ్రెస్సులు, నోట్ బుక్కులు, వారి ఆరోగ్య పరిరక్షణకు సీఎం బ్రేక్పాస్ట్, రాగి జావ, సన్న బియ్యంతో శుచి, రుచికరమైన మధ్యాహ్న భోజనం, వారానికి 3 కోడిగ్రుడ్లు అందిస్తున్నామని, నిపుణులైన వైద్య సిబ్బంది చేత పిల్లలకు ఆరోగ్య పరీక్షలే కాకుండా ఎఫ్ఎల్ఎన్ వంటి వినూత్న విద్యా కార్యక్రమం ద్వారా చక్కటి విద్యతో పాటు ఆటలు, చేతి రాత నేర్పించడం, పాటలు, యోగా, రిమీడియల్, మోటివేషనల్ తరగతులు, వివిధ సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహిస్తున్నామన్నారు.  పిల్లల్లో విలువలతో కూడిన విద్యను అందించి, శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించి, ఉన్నత వ్యక్తిత్వం కలిగిన ఉత్తమ పౌరులుగా తీర్చి దిద్దుతున్నామన్నారు. తమ పిల్లల్ని ఎస్సీ కాలనీ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలోనే చదివించాలని ఈర్ల సమ్మయ్య కోరారు. కార్యక్రమంలో టీచర్లు ఎడ్ల విజయలక్ష్మి, కర్ర సమత, చెన్నూరి భారతి, పిల్లల తల్లిదండ్రులు, పలువురు పాల్గొన్నారు.

కామెంట్‌లు