సునంద భాషితం:- వురిమళ్ల సునంద ఖమ్మం
 న్యాయములు-856
"అసాధారణ్యేన వ్యపదేశా భవంతి" న్యాయము
****"
అసాధారణ అనగా సాధారణం కానిది, విలక్షణమైనది, ప్రత్యేకమైనది. అన్యేనా అనగా ఇతరుల, వేరే,ఇతర.వ్యపదేశా అనగా ఒక విషయం,భావన, లక్షణానికి మరో పేరు. భవంతి అనగా కలుగుతున్నాయి.
అసాధారణ గుణములు కలిగి ఉండటము చేత ఒక జాతి నుండి వ్యక్తి ప్రత్యేకింపబడును అని అర్థము.
జాతి, మతం, కులం, వంశం ఏవైనా కానీ అందులో ఎవరైనా  సరే అసాధారణ రీతిలో ప్రతిభ కనబరిచినట్లయినా లేక ఒకానొక ఉన్నత స్థాయికి చేరుకున్నా, గుణవంతుడుగా  పేరు తెచ్చుకున్నా ఆ జాతి ,మతం,కులానికే పేరు వస్తుంది.అలా  ఆ వ్యక్తి కూడా తన వారి నుండి, ఇతరుల నుండి ప్రత్యేకమైన గౌరవం,అభినందనలు , ఆదరాభిమానాలను పొందుతాడు .
  ప్రజాకవి వేమన ఇలాంటి వ్యక్తి గురించి రాసిన ఓ చక్కని పద్యాన్ని చూద్దామా!
 
"కులము లోన నొకడు గుణవంతుడుండిన/కులము వెలయు వాని గుణము చేత/ వెలయు వనములోన మలయజంబున్నట్లు/విశ్వధాభిరామ వినురవేమ!"
అనగా వంశం మొత్తానికి ఒక్కడు మంచి నియమాలను పాటిస్తూ,మంచి గుణాలు కలిగి,ఎవరికీ అపకారం తలపెట్టని వాడు ఉన్నట్లయితే ఆ వ్యక్తి వలన వారి వంశమే తరిస్తుంది. పెద్ద అడవిలో ఒక్క చందనపు చెట్టు ఉంటే చాలు.ఆ అడవి మొత్తం సువాసనతో నిండి పోతుంది కదా! అని భావము.
 అలా ప్రత్యేక గుణములు కలిగిన వారితో వారి వంశము, జాతి, మతము , కులము ఉద్ధరింపబడినట్లే , వారిలో హీనుడు, దుష్టుడు కనుక పుట్టినట్లయితే వంశం వంశమే నాశనమయ్యే పరిస్థితి వస్తుందని వేమన మరో పద్యంలో చెబుతాడు.అదేమిటో చూద్దాం.
 "రాముడొకడు పుట్టి రవికుల మీడేర్చె/ కురుపతి జనియించి కులము జెఱచె/ "
అనగా రాముని పుట్టుకతో రఘువంశం ఉద్ధరింపబడింది.దుర్యోధనుని పుట్టుకతో కురు వంశము నశించింది. ఈవిధంగా మంచి వారి వలన వారు పుట్టి పెరిగిన వంశం, జాతికి పేరు కీర్తి వస్తుంది.చెడ్డవారి వలన వంశానికే కీడు సంభవిస్తుందని భావము.
 ఇవన్నీ రామాయణం, భారత గాధలు. ప్రస్తుత మన భారత దేశ చరిత్రను చూసినట్లయితే ఎందరో మహానుభావులు వారి వంశానికి, జాతికి, కులానికి వన్నె తెచ్చిన వారు ఉన్నారు.  రాజుల కాలంలో రాణి రుద్రమ దేవి, ఝాన్సీ లక్ష్మీబాయి, అక్బర్ చక్రవర్తి, అశోకుడు, ఛత్రపతి శివాజీ మొదలైన వారు.మన భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, జాతి పిత మహాత్మా గాంధీ, మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు,కొంరంభీం, భగత్ సింగ్ లాంటి వారు ఎందరో తమ వంశానికి కీర్తి ప్రతిష్టలు తీసుకుని వచ్చారు.
కేవలం పై వారే కాదు అనేక పరిశోధనలు చేసి సమాజం కోసం ఎన్నో కొత్త ఆవిష్కరణలు చేసిన వారు , ఒక్కో రంగంలో తమదైన అసాధారణ ప్రతిభ చూపిన వారందరూ ఈ కోవలోకే వస్తారు.
 ఈ "అసాధారణ్యేన వ్యపదేశా భవంతి" న్యాయము ద్వారా మనం గ్రహించాల్సిన విషయం ఏమిటంటే ప్రతిభ,జ్ఞానం,తెలివి తేటలు ఏ ఒక్కరి సొత్తు కాదు.ఏ ఒక్క జాతి,మతం, వంశానికో చెందినది కాదు. ఇలాంటి అసాధారణ ప్రతిభ ఉన్న వారు ఎందులోనైనా  ఉండవచ్చు అని.
అలా వారు ప్రత్యేకతను సంతరించుకోవడమే కాకుండా తాము జన్మించిన వంశానికి, జాతికి మాత్రమే కాకుండా దేశానికి కూడా పేరు తెస్తారనీ, ఆ దిశగా మనలో ఉన్న ప్రతిభకు, అంతర్గతంగా ఉన్న సామర్థ్యాలకు మెరుగు పెట్టుకొని,మన కుటుంబం, వంశానికి మంచి పేరు తీసుకురావాలనే అంతరార్థం ఇందులో దాగి వున్నది. మరి మనం కూడా ఆ దిశగా ప్రయత్నం చేద్దాం.

కామెంట్‌లు