వన పర్వము పంచమాశ్వాసము124 వ రోజు
కుమారస్వామి పదవులను ఇప్పించుట
ఈ సమయమున భర్తలచే విడువబడిన సప్తఋషి పత్నులు అక్కడకు వచ్చారు. " కుమారా! దుర్జనులు కొందరు మేము అగ్నిదేవునితో చేరి నిన్ను కన్నామని అసత్యప్రచారం చేసారు. ఏ పాపం ఎరుగని మమ్ము భర్తలు వదిలి వేసారు. పుత్ర సమానుడవైన నీవే మమ్ములను రక్షించాలి " అని ప్రార్ధించారు. కుమారస్వామి దేవేంద్రునితో " అమ్మా! మీరు నాకు తల్లులు సందేహం లేదు" అని " దేవేంద్రా వీరికి తగిన పదవులు ఇమ్ము " అన్నాడు. దేవేంద్రుడు " కుమారా! దక్షప్రజాపతి కుమార్తెలు చంద్రుని వివాహమాడి అతని చుట్టూ తారలుగా విర్రాజిల్లు తున్నారు. అందులో రోహిణి నక్షత్రం పక్కన ఉన్న అభిజిత్ అనే తార చంద్రుని ప్రేమను అందరికన్నా అధికంగా పొందాలని తపస్సు చేసుకోవడానికి వెళ్ళింది. ప్రస్తుతం ఆస్థానంలో ఈ ఆరుగురు కృత్తికలను ఉంచవచ్చు " అన్నాడు. ఇంతలో స్వాహాదేవి అక్కడకు వచ్చి " కుమారా! నీవు నా పుత్రుడవు నాకు ఎప్పుడూ నీ దగ్గర ఉండాలని కోరికగా ఉంది " అన్నది. " అలాగే నీవు ఎల్లప్పుడూ నా చెంతనే ఉండి నాచే మీ కోడలుచే సపర్యలందుకుంటూ సుఖంగా ఉండు" అన్నాడు. ఇంతలో సప్తమాతృక లైన హవిష, కాళి, కౌశికి, ఉద్ధత, శారిక, ఆర్య, వైధాత్రి అక్కడకు వచ్చారు. వారు "షణ్ముఖా! ఇప్పుడు లోకమాతలుగా ఉన్న వారిని తొలగించి మమ్ములను ఆపదవిలో ఉంచు " అన్నారు. కుమారస్వామి " ఇప్పటివరకు ఉన్న మాతలను ఎలా తొలగిస్తాం. మీరు వేరే వరం కోరుకోండి " అన్నాడు.వారు "లోకంలోని పసిపాపలను బాధించి పీడించే వరం ప్రసాదించు " అన్నారు. కుమారస్వామి " ఇలాంటి వరం కోరడం అనుచితము అలాంటి వరం ఇస్తున్నాను. మీకు మొక్కిన బాలలను ఎలాంటి హాని లేకుండా రక్షించండి. మీరు నరులను పదనారు వయసు వచ్చేదాకా బాధించండి. మీకు నా అంశతో పుట్టిన వాడిని రక్షగా నియమిస్తాను " అన్నాడు. ఇంకా శకుని మాత వినత, దైత్యమాత దితి, గోమాత సురభి, శునక మాత సరమ, వృక్షమాత కరంజ, సర్ప మాత కథ్రువ, కుమారుని మాత లోహితాస్య ఈ మాతృకలతో కలసి శిశువులను బాధిస్తూ ఉంటారు. అలాగే దేవ గ్రహములు, పితృ గ్రహములు, గంధర్వ గ్రహము లు, యక్ష గ్రహములు నరులను బాధిస్తుంటాయి. కాని ధర్మరాజా ! శివభక్తులను, పరిశుభ్రంగా ఉండే వారిని, శాంతి కాముకులకు, ఇంద్రియాలను జయించిన వారిని బాధించవు " అన్నాడు.
కుమారస్వామి స్వాహాదేవిని అనుగ్రహించుట
ఇంతలో అగ్నిదేవుని భార్య అక్కడకు వచ్చి " కుమారా! నేను దక్షప్రజాపతి కూతురును. నా తండ్రి నన్ను చిన్నతనంలోనే అగ్నిదేవునకిచ్చి వివాహం చేసాడు. నా భర్తకు నాపై అనురాగం లేదు నీవెలాగైనా అనురాగం కలిగేలా చెయ్యి " అని కోరింది. కుమారస్వామి " అమ్మా! బ్రాహ్మణులు అగ్నిలో హవ్యములు వేసేటప్పుడు స్వాహా కార మంత్రంతో వేస్తారు. అందు వలన నీకు నీ భర్తతో నిరంతర సాన్నిహిత్యం లభిస్తుంది " అన్నాడు. బ్రహ్మదేవుడు అక్కడకు వచ్చి అక్కడ ఉన్న శివుని చూసి " కుమారా! ఈయన మహాశివుడు త్రినేత్రుడు, త్రిపురాంతకుడు. ఈమె ఈయన భార్య పర్వతరాజ పుత్రి పార్వతి వీరు నీ తల్లి తండ్రులు. వీరు యోగ బలంచే తమ తేజస్సును అగ్నియందు అతని భార్య యందు ప్రవేశపెట్టి నిన్ను కన్నారు. వీరిని భక్తితో ఆరాధించు " అన్నాడు. కుమారస్వామి పార్వతీపరమేశ్వరులను భక్తితో నమస్కరించాడు. శివుడు కుమార సమేతుడై భద్రవటం చేరుకున్నాడు. వారి వెంట కుబేరుడు, దేవేంద్రుడు, అమోఘుడు అనే యక్షనాయకుడు, వసువులు, రుద్రులు, ఆదిత్యులు, యముడు, ఆదిత్యుడు, చంద్రుడు, వరుణుడు, వాయుదేవుడు, అగ్నిదేవుడు వెంట నడిచారు
మహిషాసురమర్ధన
ధర్మరాజా ! ఆ సమయంలో మహిషాసురుడు రాక్షస సేనలతో దండెత్తి వచ్చాడు. క్షణాలలో దేవసైన్యాన్ని చిందరవందర చేసాడు. ఇది చూసి దేవతలు యుద్ధం చేయడం ఆపి పారిపోయారు. దేవేంద్రుడు వారికి ధైర్యం చెప్పి యుద్ధోన్ముఖులను చేసాడు. దేవతలకు రాక్షసులకు మధ్య భీకర పోరు జరిగింది. ఆ యుద్ధంలో శివుడు కూడా పాల్గొన్నాడు. మహిషాసురుడు శివుని రథం పట్టుకున్నాడు. దేవతలు శివుడు మహిషాసురుని చేతిలో మరణిస్తాడని భయపడ్డారు. శివుడు కుమారస్వామిని చూసి " కుమారా! చూసితివా వీడి సాహసం. నా రథాన్ని పట్టుకున్నాడు. వీడికి ఆయుషు మూడింది. వెంటనే వీడిని సంహరించు " అన్నాడు. కుమారస్వామి శక్తి ఆయుధాన్ని మహిషాసురుని పై ప్రయోగించాడు. అది మహిషాసురునితో అతని సైన్యాన్ని దహించింది. దేవతలు కుమారస్వామిని స్తుతించారు. శివుడు దేవతలతో " ఇతని పరాక్రమం చూసారా! ఇకపై మీరి నన్ను ఎలా పూజ్య భావంతో సేవిస్తారో ఇతనిని అలాగే సేవించండి " అని చెప్పి భద్రవటానికి వెళ్ళాడు. ఈ విధంగా కుమారస్వామి దేవతల శత్రువులను ఒక్క రోజులో జయించాడు.
భారతంలో ఉండేది భూమిపై ఎక్కడైనా ఉంటుంది భారతంలో లేనిది భూమిపై ఎక్కడా లేదు
రోజూ భారతం చదవండి భగవద్ అనుగ్రహం పొందండి


addComments
కామెంట్ను పోస్ట్ చేయండి