జేమ్స్ హారిసన్ రక్తదానం: - - యామిజాల జగదీశ్
 అది 1951. ఆస్ట్రేలియాకు చెందినజేమ్స్ హారిసన్ ను 14వ ఏట ఛాతీలో తలెత్తిన అనారోగ్యంతో ఆస్పత్రిలో చేర్చారు. ఆపరేషన్ సమయంలో, ఆయనకు బహుళ రక్త మార్పిడి అవసరమైంది. ఆస్పత్రిలో కోలుకుంటున్న సమయంలో, జేమ్స్ ఆలోచనలో పడ్డారు. తాను జీవించడానికి కారణం, అపరిచితులు తమ రక్తాన్ని ఇవ్వడమే. అటువంటప్పుడు తానూ సమాజానికి ఏదో ఒకటి చెయ్యాలనుకున్నారు. తనకు తాను నిశ్శబ్దంగా ఓ వాగ్దానం చేసుకున్నారు. అదేంటంటే,  జీవితాంతం రక్తదానం చేయాలన్నదే ఆ నిర్ణయం.
జేమ్స్ 18 సంవత్సరాల వయసు నుంచి క్రమం తప్పకుండా రక్త దానం చేయడం ప్రారంభించారు. 
అప్పుడే వైద్యులు అసాధారణమైన దాన్ని కనుగొన్నారు: అతని రక్తంలో యాంటీ - డి అనే అరుదైన యాంటీబాడీ ఉంది. ఈ యాంటీ బాడీని గర్భిణీ స్త్రీలకు ప్రాణాలను రక్షించే చికిత్స చేయడానికి ఉపయోగిస్తారు. వారి రోగనిరోధక వ్యవస్థలు వారి పుట్టబోయే పిల్లలపై దాడి చేసే అవకాశం ఉంది. దీనిని రీసస్ వ్యాధి అని పిలుస్తారు.
ఈ చికిత్స ఉనికిలోకి రాకముందు, వేలాది మంది పిల్లలు చనిపోయారు. లేదా ప్రతి సంవత్సరం తీవ్రంగా దెబ్బతిన్న మెదడుతో జన్మించారు.
అయితే ఈ క్లిష్టపరిస్థితిలో జేమ్స్ హారిసన్ రక్తం దానిని మార్చి వేసింది.
60 సంవత్సరాలకు పైగా, అతను ప్రతి రెండు వారాలకు ఒకసారి రక్తదానం చేస్తూ వచ్చాడు.
అతని ప్లాస్మాను ఉపయోగించి ఆస్ట్రేలియా అంతటా 2 మిలియన్లకు పైగా శిశువులను రక్షించిన యాంటీ - డి ఇంజెక్షన్లను తయారు చేశారు.
అతని కారణంగా, దేశంలో రీసస్ వ్యాధి దాదాపు పూర్తిగా నిర్మూలించినట్లయ్యింది.
తన రక్తంలో Rh D యాంటిజెన్‌కు వ్యతిరేకంగా ప్రతిరోధకాలు ఉన్నట్లు కనుగొనబడిన తర్వాత హారిసన్ ప్రధానంగా ప్లాస్మాను దానం చేశాడు. ఇవి Rh వ్యాధిని నివారించడంలో ఉపయోగకరంగా మారాయి.  న్యూ సౌత్ వేల్స్ Rh ప్రోగ్రామ్‌కు వ్యవస్థాపక దాతలలో ఒకడు.
జేమ్స్ క్రిస్టోఫర్ హారిసన్ 1936 డిసెంబర్ 27న న్యూ సౌత్ వేల్స్‌లోని జూనీలో పెగ్గి, రెజినాల్డ్ హారిసన్ దంపతులకు జన్మించారు.
1969లో ప్రపంచంలోనే మొట్టమొదటిది అయిన న్యూ సౌత్ వేల్స్ Rh ప్రోగ్రామ్ వ్యవస్థాపక దాతలలో హారిసన్ ఒకరు. అప్పటి నుండి ఆయన నిరంతరం దానం చేస్తూ వచ్చారు.
జేమ్స్ తన జీవితకాలంలో, చేసిన రక్తదానంలో పదివేల మోతాదుల విలువైన యాంటీబాడీలను కలిగి ఉన్నాయి.
ఆయనకు 1999 జూన్ 7న మెడల్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ఆస్ట్రేలియా (OAM) లభించింది.
2007లో, ఆస్ట్రేలియా ప్లాస్మా విరాళాన్ని విదేశీ సంస్థలకు ఇచ్చే ప్రణాళికలను హారిసన్ విమర్శిం చారు. వాణిజ్యపరం చేయడంవల్ల స్వచ్ఛంద విరాళాలను నిరుత్సాహపరుస్తుందని ఆయన భావించారు.
2011లో,  ఆయనను ఆస్ట్రేలియన్ ఆఫ్ ది ఇయర్ అవార్డు వరించింది.
హారిసన్ భార్య బార్బరా లిండ్‌బెక్‌ కూడా రక్తదానం చేసిన వారే.
జేమ్స్ దంపతులకు ట్రేసీ అనే కుమార్తె, జారోడ్, స్కాట్ అనే ఇద్దరు మనవళ్ళు ఉన్నారు. 
81 సంవత్సరాల వయస్సులో చివరిసారిగా అతను రక్తదానం చేసిన రోజున నర్సులు లేచి నిల్చుని చప్పట్లు చరచి అభినందించారు. అతనిని అన్ని విధాలా కొనియాడారు.
జేమ్స్ హారిసన్ ని "మ్యాన్ విత్ ది గోల్డెన్ ఆర్మ్" అని కీర్తించారు.
2025 ఫిబ్రవరి 17న, హారిసన్ ఉమినా బీచ్‌లోని పెనిన్సులా విలేజెస్ నర్సింగ్ హోమ్‌లో నిద్దట్లోనే మరణించారు. అప్పుడాయన వయస్సు 88 ఏళ్ళు. 18 నుండి 81 సంవత్సరాల మధ్య ఆయన 1,173 సార్లు రక్తదానం చేసారు.



కామెంట్‌లు