సంపూర్ణ మహాభారతముసరళ వ్యావహారిక భాషలో...!
 వన పర్వము షష్టమాశ్వాసము- 143 వ రోజు
సీతాపహరణం
అవకాశం కోసం చూస్తున్న రావణుడు సన్యాసి వేషంలో అక్కడికి వచ్చాడు. మార్గాయాసంతో అలసినట్లు కనిపిస్తున్న రావణుని చూసి అతిథి సత్కారాలు చేసింది. సీతను చూసిన రావణుడు మోహవివశుడై " సుందరీ! నా పేరు రావణుడు, దానవ నాయకుడను నా రాజధాని లంక. నీవు నన్ను భర్తగా వరించి భోగాలు అనుభవించు. రాజ్యాన్ని కోల్పోయి అడవుల వెంట తిరుగుతున్న రామునితో ఏమి సుఖపడతావు. వేరు ఆలోచించక నన్ను వరించు " అన్నాడు. సీత " అయ్యా! మీరు ఇలా మాట్లాడటం తగునా! సూర్యచంద్రులు తేజం కోల్పోయినా, ఆకాశం నేల కూలినా, సముద్రములు ఇంకి పోయినా, భూమి బద్దలు అయినా నేను నా భర్త రాముని తప్ప అన్యుని తలవను " అన్నది. రావణుడు సీతను బలవంతంగా పట్టుకుని ఆకాశానికి ఎగిరాడు. అప్పుడు సీత పెద్దగా కేకలు వేస్తూ " దేవతలారా ! నేను జనక మహారాజు కూతురిని, రాముని భార్యను. ఈ రావణుడు నన్ను బలవంతంగా ఎత్తుకు పోతున్నాడు. మీకు నమస్కరిస్తాను నన్ను కాపాడండి " అని రోదించింది. ఆ అరుపులు జటాయువు అనే పక్షి విని రావణుని అడ్డగించాడు. " ఓరి రావణా! ఈమెను ఎందుకు బలవంతంగా ఎత్తుకుపోతున్నావు. ఈమెను విడవకున్న నిన్ను సంహరిస్తున్నాను " అన్నాడు. జటాయువుకు రావణునికి మధ్య పోరు ఘోరంగా జరిగింది. జటాయువు తన ముక్కుతో, గోళ్ళతో రావణుని గాయ పరచింది. రావణుడు జటాయువు రెక్కలు ఖండించాడు. జటాయువు నేల కూలాడు. రావణుడు సీతను ఎత్తుకు పోతున్నాడు. సీత ఇక తనను రక్షించే వారు లేరని అనుకుంటున్న సమయంలో ఋష్యమూక పర్వతంపై ఉన్న వానరములను చూసి తన ఆభరణములు చీర కొంగున మూటకట్టి పడవేసింది. రావణుడు సీతను లంకకు తీసుకు వెళ్ళాడు. సీతను అశోకవనంలో ఉంచి రక్షణగా రాక్షస స్త్రీలను కాపలా ఉంచారు.
సీతాన్వేషణ
దండ కారణ్యంలో మారీచుని సంహరించి రాముడు కుటీరానికి తిరిగి వస్తున్నాడు. దారిలో లక్ష్మణుడు ఎదురు వచ్చాడు. రాముడు " లక్ష్మణా! రాక్షసులు తిరిగే ఈ అరణ్యంలో సీతను ఒంటరిగా ఎందుకు వదిలి వచ్చావు అని మందలించాడు " అన్నాడు. లక్ష్మణుడు సీత తనను ఆక్షేపించిన విషయం వివరించాడు. రాముడు జరిగిన దానికి చింతించాడు. రామునికి దుశ్శకునాలు గోచరించాయి. సీతకు ఏదో ఆపద వచ్చిందని మనస్సు శంకించింది. కుటీరంలో సీత కనపడ లేదు అక్కడ కనిపించిన సంకేతాలు చూసి సీత అపహరణకు గురి అయినట్లు గ్రహించి వేదన పడ్డారు. సీత కోసం అన్వేషించటం మొదలు పెట్టారు. దారిలో కొన ఊపిరితో ఉన్న జటాయువు కనపడి " రామా! నా పేరు జటాయువు. నేను నీ తండ్రి దశరధునికి మిత్రుడను. నీ భార్య సీతను రావణుడు అపహరించి దక్షిణ దిక్కుగా పోయాడు. నేను అడ్డగించినందుకు నా రెక్కలు ఖండించాడు " అని చెప్పి ప్రాణాలు విడిచాడు. రాముడు జటాయువుకు అంతిమ సంస్కారములు చేసాడు.

భారతంలో ఉండేది భూమిపై ఎక్కడైనా ఉంటుంది భారతంలో లేనిది భూమిపై ఎక్కడా లేదు
రోజూ భారతం చదవండి భగవద్ అనుగ్రహం పొందండి

కామెంట్‌లు