ఆపదలో ఉన్న బాలలను ఆదుకొని దేశాభివృద్ధికి కృషి చేద్దామని చైల్డ్ హెల్ప్ లైన్ కేస్ వర్కర్ డి.బి.రాజు అన్నారు. పాలఖండ్యాం ఎంపియుపి పాఠశాలలో నిర్వహించిన బాలల సంరక్షణ అవగాహన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. వివక్షతకు గురైన, ఇంటి నుంచి పారిపోయిన, తప్పిపోయిన, నిరాశ్రయులైన వారు, బాలకార్మికులు మన దృష్టికి వస్తే 1098 నెంబర్ కి ఫోన్ చేయాలని సూచించారు. అలాంటి వారిని ఆదుకొని వారికి మంచి జీవితాన్ని అందించడానికి మనమంతా బాధ్యత వహించాలని రాజు అన్నారు.
డి.సి.పి.ఓ. కె.వి.రమణ ఆదేశాలమేరకు సంరక్షణ అవసరమైన పిల్లల కోసం ఇటువంటి అవగాహన సదస్సులు జిల్లాలో నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. చైల్డ్ హెల్ప్ లైన్ కేస్ వర్కర్ పి.సాయిలక్ష్మి మాట్లాడుతూ అక్రమ రవాణాకు గురైన పిల్లలను, బిక్షాటన చేస్తున్న పిల్లలను, వేధింపులకు గురైన పిల్లలను కాపాడేందుకు నిరంతరం తమ సేవలను అందజేస్తామని అన్నారు. వేరే రాష్ట్రాలకు చెందిన చిన్న పిల్లలను రైల్వే స్టేషన్ లలో వదిలేసిన కసాయిలు, అప్పుడే పుట్టిన శిశువుల్ని తుప్పల్లో డొంకల్లో పారవేసిన దుర్మార్గులు నేటి సమాజంలో ఉండడం దురదృష్టకరమని, అలాంటి అనాథలకు జీవితాలను ప్రసాదించడం మహా పుణ్యప్రదమని సాయిలక్ష్మి అన్నారు.
ఉపాధ్యాయులు కుదమ తిరుమలరావు మాట్లాడుతూ మహిళాభివృద్ధి శిశు సంక్షేమ శాఖ, స్త్రీ శిశు సంక్షేమ శాఖ, బేటీ బచావో బేటీ బఠావో సంస్థలు ప్రభుత్వం వారి నిర్దేశాలతో ఈ చైల్డ్ హెల్ప్ లైన్ పనిచేస్తుందని చిన్నారుల బాగోగుల కోసం కృషి చేస్తున్నారని కృతజ్ఞతాభివందనాలు తెలిపారు.
నేటి బాలలే రేపటి పౌరులని, కాబట్టి బాలల హక్కులు బాలల విధులు సాహసబాలల అవార్డులు బాలవికాశం బాలసంఘాలు వంటివి ప్రవేశపెట్టి అనేక ప్రయోజనాలు కల్పించే అంశాలను ఆయన ప్రస్తావించారు. చైల్డ్ హెల్ప్ లైన్ కేస్ వర్కర్లు డి.బి.రాజు, పి.సాయిలక్ష్మిలతో పాటు ఉపాధ్యాయులు కుదమ తిరుమలరావు, ఉప్పలపాటి ఆదిలక్ష్మి, యెందువ వెంకటరమణ, ముల్లు సుజాత, ఎం.పెంటయ్య, జిఎంఆర్ విఎఫ్ వాలంటీర్ పిల్లల దాలమ్మలు పాల్గొని ప్రసంగించారు.
addComments
కామెంట్ను పోస్ట్ చేయండి