సంపూర్ణ మహాభారతముసరళ వ్యావహారిక భాషలో...!

 వన పర్వము షష్టమాశ్వాసము- * 144వ రోజు*
కబంధుడు
రామలక్ష్మణులు సీతను వెదుకుతూ దక్షిణ దిశగా వెళ్ళారు. దారిలో కబంధుడు లక్ష్మణుని పట్టుకున్నాడు. కబంధుడు ఒక వింత జీవి. దాని గుండెలో కళ్ళు పొట్టలో నోరు ఉంది. చేతులు మాత్రం చాలా పొడవు అది కూచున్న చోటు నుండి కదలక చేతులను చాచి చిక్కిన జంతువులను పట్టుకుని తింటూ జీవిస్తుంది. లక్ష్మణుడు కంబంధుడి పట్టు నుండి తప్పించుకో లేక పోయాడు. " అన్నా! శ్రీరామా! నన్ను రక్షించు. నీకు రాజ్యం పోయింది, తండ్రి మరణించాడు, భార్యను పోగొట్టుకున్నావు ఇప్పుడు ఈ కబంధుడు నన్ను పట్టుకున్నాడు. నా వంటి దురదృష్టవంతుడు ఉంటాడా " అని అరిచాడు. రాముడు లక్ష్మణునికి ధైర్యం చెప్పి బాణాలతో కబంధుని హస్తాలు ఖండించి లక్ష్మణుని విడిపించాడు. ఒక కత్తి తీసుకుని కబంధుని పొట్ట చీల్చగా అతడు ఒక దివ్య పురుషుడుగా మారి పోయాడు. " రామా! నేను విశ్వావసు అనే గంధర్వుడను. బ్రహ్మదేవిని శాపం వలన నాకు ఈ రాక్షస జన్మ వచ్చింది. నేడు నీ వలన నాకు మోక్షం కలిగింది. రావణుడు అనే రాక్షసుడు నీ భార్యను తీసుకు వెళ్ళి లంకలో ఉంచాడు. పంపా సరస్సు ఒడ్డున ఉన్న ఋష్య మూక పర్వతం పై వాలి సోదరుడైన సుగ్రీవుడు నివసిస్తున్నాడు. అతనితో నీవు సఖ్యం చేసిన నీ కార్యం సిద్ధిస్తుంది " అని చెప్పి గంధర్వుడు వెళ్ళి పోయాడు.
కిష్కింద
రామలక్ష్మణులు పంపా సరోవర తీరాన తమ పితరులకు తర్పణం విడిచారు. అక్కడి నుండి చాలా ఎత్తుగా కనపడు తున్న ఋష్యమూక పర్వతాన్ని చేరారు. ఋష్యమూక పర్వతం పైనున్న వానరరాజు సుగ్రీవుడు రామలక్ష్మణులను చూసి వారి వృత్తాంతం తెలుసుకు రమ్మని మంత్రి అయిన హనుమంతుని పంపాడు. హనుమంతుడు చాకచక్యంగా వ్యవహరించి రామలక్ష్మణుల గురించిన సకల వృత్తాంతం గ్రహించి సుగ్రీవునకు నివేదించాడు. రామలక్ష్మణులకు సుగ్రీనికి మైత్రి చేసాడు. సుగ్రీవుడు సీతాదేవి కిందకు జారవిడిచిన ఆభరణాలు చూపించాడు. రాముడు ఆ ఆభరణాలు గుర్తు పట్టాడు. సుగ్రీవుడు తన అన్న వాలి తన భార్యను అపహరించి తన మీద నిష్కారణ కక్ష పెంచుకుని తనను రాజ్యం నుండి వెడలగొట్టాడని తన అన్నను చంపి తనకు రాజ్యం ఇప్పించమని కోరాడు. బదులుగా సీతాన్వేషణలో తాను సాయం చేస్తానని చెప్పాడు. రాముడు అందుకు ఒప్పుకున్నాడు.
వాలి వధ
అందరూ కిష్కిందకు భయదేరి నగరం వెలుపల నిలిచి సుగ్రీవుడు తన అన్న వాలిని యుద్ధానికి పిలిచాడు. వాలి సుగ్రీవునితో యుద్ధానికి పోతుండగా వాలి భార్య తార " నాధా! సుగ్రీవుడికి ఏదో సాయం లభించినట్లు ఉందు. అయోధ్య రాజు దశరధుని కుమారులైన రామ లక్ష్మణులతో సుగ్రీవునకు మైత్రి కుదిరిందని చారుల ద్వారా విన్నాను. రాముని భార్య సీతను రావణుడు అపహరించాడు. రాముడు సుగ్రీవుని సాయం కోరాడు. సుగ్రీవుడు అంగీకరించాడు. ప్రతిఫలంగా సుగ్రీవునకు సాయం చేస్తానని అన్నాడంట. మహా బలవంతులైన మైందుడు, ద్వివిదుడు, హనుమంతుడు, జాంబవంతుడు అతనికి మంత్రులుగా ఉన్నారు. కనుక ఇప్పుడు సుగ్రీవునితో యుద్ధానికి పోవడం ప్రమాదకరం " అని తార వాలిని వారించింది. కాని వాలి భార్యమాట లక్ష్యపెట్టక సుగ్రీవునితో యుద్ధానికి సిద్ధం అయ్యాడు. సుగ్రీవుని చూసి వాలితో " ఓరీ! మంద బుద్ధీ నేను ఎన్నో మార్లు నిన్ను ఓడించి తరిమి వేసాను. మరల సిగ్గు లేకుండా యుద్ధానికి ఎందుకు వచ్చావు " అన్నాడు. సుగ్రీవుడు " వాలి! నేను భార్యను పోగొట్టుకుని రాజ్యభ్రష్టుడనయ్యాను. నేను ఉండి చేసేదేముంది అందుకే యుద్ధానికి వచ్చాను " అని వాలితో అన్నాడు. వాలి సుగ్రీవులు చెట్లతోను, బండలతోను యుద్ధం చేసుకున్నారు. తరువాత ఒకరితోనొకరు ముష్టి యుద్ధం చేసుకుంటున్నారు. కవలలైన వారిని పోల్చలేక రాముడు వాలిని చంపలేక పోయాడు. సుగ్రీవుడు తిరిగి వచ్చి రామునితో నిష్టూరంగా మాట్లాడాడు. రెండవ సారి రాముని సలహాతో గుర్తు కొరకు వనపుష్ప మాలను ధరించి సుగ్రీవుడు వాలితో యుద్ధంచేసాడు. రాముడు వేసిన బాణాలకు వాలి నేల కూలాడు. తనను చంపడం అధర్మమని వాలి రామునితో వాదించాడు. రాముడు చెప్పిన ధర్మసూక్ష్మాలను అంగీకరించి తనభార్యను సుగ్రీవునికి అప్పగించి కుమారుడైన అంగదుని యువ రాజుని చేసే బాధ్యత రామునికి అప్పచెప్పి ప్రాణాలు వదిలాడు. సుగ్రీవుడు రామునకు నమస్కరించి " రామా నీమాట నీవు నిలబెట్టు కున్నావు. ఇప్పుడు ఎండా కాలం తరువాత వర్షాకాలం సితాన్వేషణకు ఇది తరుణం కాదు కనుక నేను వర్షాకాలం ముగియ గానే సీతాన్వేషణ ప్రారంభిస్తాను " అన్నాడు.

భారతంలో ఉండేది భూమిపై ఎక్కడైనా ఉంటుంది భారతంలో లేనిది భూమిపై ఎక్కడా లేదు
రోజూ భారతం చదవండి భగవద్ అనుగ్రహం పొందండి

కామెంట్‌లు