సంపూర్ణ మహాభారతము*సరళ వ్యావహారిక భాషలో...!

 వన పర్వము షష్టమాశ్వాసము-136 వ రోజు
దేవదూతను తిరిగి పంపుట
ఒక దేవదూత విమానం తీసుకు వచ్చి ముద్గలునితో " మహామునీ! నీవు చేసినా పుణ్యం వలన నీకు స్వర్గలో లోక ప్రాప్తి కలిగింది. విమానం ఎక్కుము " అని చెప్పారు. ముద్గలుడు ఆ దేవదూతను చూసి " అయ్యా! దేవలోకం ఎలా ఉంటుంది " అని అడిగాడు " తపస్సు చేసి సిద్ధి పొందిన మహా మునులు, యజ్ఞాలు చేసిన వాళ్ళు, సత్యసంధులు, ఇంద్రియములు జయించిన వారు, దానం చేసిన వారు. యుద్ధంలో మరణించిన వారు దేవలోకంలో నివసిస్తారు. ఇంకా అప్సరసలు, సిద్ధులు, సాధ్యులు, దేవమునులు, మరుత్తులు నివసిస్తంటారు " మేరు పర్వత శిఖరం అక్కడే ఉంది. నందనోద్యానం ఉంది. అక్కడ ఆకలి దప్పులు ఉండవు. వ్యాధులు, ముసలితనం ఉండదు. అక్కడ అందరికి తేజోమయ దేహాలు ఉంటాయి. స్వర్గంలో ఉన్నంత కాలం దుఃఖం ఉండదు, నిరంతర సౌఖ్యం, ఆనందం ఉంటాయి. స్వర్గలోకం పైన బ్రహ్మలోకం ఉంటుంది. అక్కడ మనువులు, మహర్షులు మాత్రం ఉంటారు. అక్కడ పునర్జన్మ ఉండదు. ప్రళయకాలంలో అన్ని లోకాలు నాశనం అవుతాయి. బ్రహ్మలోకం మాత్రం నిలిచి ఉంటుంది. మనుష్యుడు భూలోకంలో చేసిన పుణ్యాలకు ఫలితం స్వర్గలోకంలో అనుభవిస్తారు. అక్కడ ఎలాంటి పుణ్యం చేసుకోవడానికి వీలు లేదు. చేసిన పుణ్యఫలం అనుభవించిన తరువాత మరల భూలోకానికి వస్తారు. వచ్చిన మానవుడు వాటిని విడువలేక వేదనకు గురి ఔతాడు. స్వర్గలోకంలో ఉన్నవారు కూడా తమకంటే ఉన్నత స్థిలో ఉన్న వారిని చూసి మనసులో బాధ పడతారు. బ్రహ్మలోకం శాశ్వతం. స్వర్గలోకం అనుభవానికి మాత్రమే. భూలోకం కర్మభూమి. భూలోకంలో చేసిన సత్కర్మల ఫలం స్వర్గలోకంలో అనుభవిస్తారు " అని చెప్పి స్వర్గ లోకానికి రమ్మని ముద్గలుని పిలిచాడు. ముద్గలుడు " అయ్యా! నాకు అశాశ్వతములైన స్వర్గసుఖములు అవసరం లేదు. ఏ లోకానికి పోతే తిరిగి జన్మలేదో ఆ లోకానికి పోవడానికి ప్రయత్నిస్తాను " అన్నాడు. దేవదూత వెళ్ళి పోయాడు. ఆ తరువాత ముద్గలుడు ద్వందముల యందు ఆసక్తి వదిలి, అంతటా సమభావంతో చూసి జ్ఞానయోగి అయ్యాడు. జీవన్ముక్తుడు అయ్యాడు. కనుక ధర్మరాజా ! నీవు రాజ్యం పోయినందుకు చింతించ వలదు " అని హితబోధ చేసాడు. తరువాత తన ఆశ్రమానికి వెళ్ళాడు.
సైంధవుడు ద్రౌపదిని చూచుట
కొంత కాలం గడిచింది ఒక రోజు పాండవులు అడవికి వేటకు వెళ్ళారు. ద్రౌపది కుటీరంలో ఒంటరిగా ఉంది. ఆ సమయంలో సింధు దేశాన్ని పాలించే సైంధవుడు తన చతురంగ బలాలతో పెక్కుమంది ఇతర మిత్ర రాజులతో కలిసి సాళ్వరాజ పుత్రిని వివాహం చేసుకోవడానికి పయనిస్తూ మార్గ మధ్యంలో కామ్యకవనం చేరుకున్నాడు. కుటీరం ముందు నిలిచి ఉన్న ద్రౌపదిని చూసి మోహ పరవశుడైయ్యాడు. తన మిత్రుడైన కోటికాస్యుని పిలిచి " ఈ సుందరాంగి ఎవరు? ఆమెపట్ల నా మనసు లగ్నం అయింది. ఆమెతో మాట్లాడి ఎలాగైనా నన్ను చేరేలా చెయ్యాలి " అన్నాడు. కోటికాస్యుడు ద్రౌపది వద్దకు వెళ్ళి " లలనా! నీవెవరు, వన్యమృగాలు తిరిగే ఈ అడవిలో ఎందుకు ఉన్నావు. వనదేవతవా? శచీదేవివా? లక్ష్మీ దేవివా? నీ భర్త ఎవరు? నీ పేరేమి? నా పేరు కోటికాస్యుడు. మహా బలవంతుడను. అడుగో అక్కడౌన్న వాడు త్రిగర్త దేశాధి పతి, ఆ పక్కన కళింగ దేశాధిపతి, ఆ పక్కన ఉన్నది సింధు దేశాధీశుడు జయద్రధుడు. అతనికి నీ మీద మనసు కలిగింది. అందుకే నన్ను పంపాడు " అన్నాడు. ఆ మాటలు విన్న ద్రౌపది " అన్నా నేను ఒంటరి దానను, పుత్రవతిని నీవు నా దగ్గరకు రావడం తగదు. నన్ను సామాన్య స్త్రీగా ఎంచ వద్దు. నేను పాంచాలరాజ పుత్రిని, నా పేరు కృష్ణ, పాండవుల ధర్మ పత్నిని వారితో వనవాసం చేస్తున్నాను. కొంత సేపట్లో నా భర్తలు వస్తారు. ఈ సమీపంలో కొంత సమయం ఉండండి. వారు రాగానే అతిథి సత్కారం చేస్తాను " అన్నది. కోటికాస్యుడు జరిగినది జయద్రధునికి చెప్పాడు. ఎలాగైనా ద్రౌపదిని అపహరించాలన్న ఉద్దేశంతో జయద్రధుడు కుటీరంలో ప్రవేశించాడు.

భారతంలో ఉండేది భూమిపై ఎక్కడైనా ఉంటుంది భారతంలో లేనిది భూమిపై ఎక్కడా లేదు
రోజూ భారతం చదవండి భగవద్ అనుగ్రహం పొందండి

కామెంట్‌లు