మంత్రి శ్రీనివాస్ చే ఉపాధ్యాయ స్పూర్తి సంకలనాన్ని స్వీకరించిన తిరుమలరావు

 రాష్ట్ర చిన్న, మధ్య తరహా పరిశ్రమలు, గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ, ఎన్.ఆర్.ఐ. సాధికారిక మరియు సంబంధాలు శాఖల మంత్రివర్యులు కొండపల్లి శ్రీనివాస్ ఉపాధ్యాయ స్పూర్తి సంకలనం ఆవిష్కరణ చేసి, అనంతరం తిరుమలరావుకు ఆ పుస్తకాన్ని బహూకరించారు. జాతీయ స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కార గ్రహీత,  
పాలఖండ్యాం ఎంపియుపి పాఠశాల సాంఘిక శాస్త్రోపాధ్యాయులు కుదమ తిరుమలరావుకు ఉపాధ్యాయ స్పూర్తి సంకలనంలో స్థానం లభించింది. బొబ్బిలి రచనా సమాఖ్య ఆధ్వర్యంలో అధ్యక్షులు మింది విజయ మోహనరావు నేతృత్వంలో రూపొందిన ఎనిమిదో సంకలనం ఉపాధ్యాయ స్పూర్తిలో తిరుమలరావు స్వీయ అనుభవాన్ని ప్రచురించారు. జాతీయ స్థాయిలో ఎంపికైన డెబ్బది ఐదు మంది స్పూర్తి గాథలను పుస్తక రూపంలో తీసుకురాగా తిరుమలరావు సేవలు కూడా చోటు చేసుకున్నాయి. విజయనగరం జిల్లా కేంద్రంలో గల క్షత్రియ పరిషత్ కల్యాణ మండపంలో జరిగిన నవ్యాంధ్ర రాష్ట్ర రచయిత్రుల సంఘం ఉత్తరాంధ్ర మహిళా వేదికపై తిరుమలరావు ఈ సంకలనం స్వీకరించారు. దాదాపు పాతికేళ్ళ క్రితం తిరుమలరావు చలివేంద్రి పాఠశాలలో పనిచేస్తున్నప్పుడు రాళ్ళ కుప్పలపై ఆటలాడుతూ గడిపే బాలుణ్ణి ఏ విధంగా పాఠశాలకు రప్పించి ప్రయోజకునిగా తీర్చిదిద్దారో వివరించే స్పూర్తి గాథను ఈ సంకలనంలో ఎంపిక చేసి ప్రచురించారు. విజయనగరం  నియోజకవర్గం శాసన సభ్యులు పూసపాటి అదితి విజయలక్ష్మీ గజపతి రాజు, పద్మభూషణ్ డా.యార్లగడ్డ లక్ష్మీప్రసాద్, కృష్ణా జిల్లా రచయితల సంఘం అధ్యక్షులు డా.జి.వి.పూర్ణచంద్,  నవ్యాంధ్ర రాష్ట్ర రచయిత్రుల సంఘం రాష్ట్ర గౌరవాధ్యక్షులు తేళ్ళ అరుణ, రాష్ట్ర ఉపాధ్యక్షులు జిల్లా అధ్యక్షులు చివుకుల శ్రీలక్ష్మి, సహాయ కార్యదర్శి దాసరి పద్మ తదితరులు పాల్గొన్నారు.
కామెంట్‌లు