జంక్ ఫుడ్ : - యామిజాల జగదీశ్
 పిజ్జాలు, బ‌ర్గ‌ర్లు, చ‌క్కెర అధికంగా ఉండే కుకీస్‌, స్వీట్లు, ఇత‌ర జంక్‌ఫుడ్‌ను చూడ‌గానే ఎవ‌రికైనా నోరూరుతుంది. ఆ ఆహార ప‌దార్థాల‌ను ఎవ‌రైనా ఇష్టంగానే తింటారు. కానీ వాటిని తింటే అధిక బ‌రువు, డ‌యాబెటిస్‌, గుండె జ‌బ్బులు, క్యాన్స‌ర్ వంటి వ్యాధులు వ‌చ్చేందుకు అవ‌కాశం ఉంటుంది. ఎప్పుడో ఒకప్పుడు తింటే ప్రమాదమేమీ లేదు కానీ అదే పనిగా తింటే మాత్రం ఆరోగ్యానికి ముప్పనే అభిప్రాయం లేకపోలేదు.
 సరియైన పౌష్టిక విలువలు లేని లేక సరిపోయేంత క్యాలరీలు లేని లేదా అనారోగ్యకరమైన అహారపదార్ధాలను జంక్ ఫుడ్ అంటారు . జంక్ ఫుడ్ తినడం అనారోగ్యానికి దారి తీసే అవకాశాలు ఎక్కువ. జంక్ ఫుడ్ లో ఎక్కువ పరిమాణంలో సాచ్యురేటెడ్ కొవ్వులు, సాల్ట్, సుగర్ ఉంటాయి. ఆరోగ్యకరమైన పండ్లు, కాయకూరలు, ఫైబర్ ఉన్న పదార్ధములు ఉండవు . సాధారణంగా ఉప్పు స్నాక్స్ అంటే చిప్స్, కాండీ, తీపి ఉండలు, పంచదార పెట్తిన సీరల్స్, ఫ్రైడ్ ఫాస్ట్ ఫుడ్స్, కార్బొనేటెడ్ డ్రింక్స్, రెడిమేడ్ కూల్ డ్రింక్స్, మసలా చాట్, బజ్జీలు వంటివి వీటి కిందకే వస్తాయి. బర్గర్, పిజా, ఫ్రెంచి ఫ్రైస్, కేక్స్, నూడిల్స్ పిల్లలకు నచ్చే జంక్ ఫుడ్. అయితే జంక్‌ ఫుడ్‌ తింటే స్థూలకాయం వస్తుంది. ఈ ఊబకాయం వలన చిన్న వయస్సులోనే బిపి, ఆపై షుగర్‌ వస్తుంది. శాస్త్రవేత్తలు. ధూమపానం, మత్తు మందులలాగానే జంక్‌ ఫుడ్‌ తినడం కూడా వ్యసనంగా మారుతుందంటున్నారు. అంతే కాదు మనిషిపై మారక ద్రవ్యంతో సమానంగా దుష్ప్రభావాన్ని సైతం చూపుతాయన్నది పెద్దల మాట. 
అమెరికాలోని ఫ్లోరిడాకు చెందిన స్క్రిప్స్‌ రిసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ శాస్త్రవేత్తలు మూడేళ్లపాటు పరిశోధనలు చేసి జంక్‌ ఫుడ్‌ కొకైన్‌ వంటి మాదక ద్రవ్యాలతో సమానమని తేల్చారు. 
జంక్‌ ఫుడ్‌కు అంటే బేకరి పదార్థాలకు అలవాటు పడితే అది ఊబకాయానికి దారి తీయడమే కాకుండా మెదడుకు కూడా హాని కలిగిస్తుందని కనుగొన్నారు. ఇందుకు కారణం బేకరీ పదార్థాల్లో కొవ్వు పదార్థం ఎక్కువగా ఉండటమేనని వెల్లడించారు. 
జంక్‌ ఫుడ్‌ వల్ల కలిగే ప్రభావాలు తెలుసుకునేందుకు వీరు ఎలుకలపై మూడేళ్ల పాటు పరిశోధనలు సాగించారు. అధిక కేలరీలు గల ఆహారం తీసుకోవడం వల్ల మెదడుకు ప్రమాదమని తేల్చారు.
మన దేశంలోనూ ఫాస్ట్‌ ఫుడ్‌ సంస్కృతి శరవేగంగా పెరిగిపోతున్నాది. గత కొన్ని సంవత్స రాలుగా ఫాస్ట్‌ ఫుడ్‌ పరిశ్రమ అనూహ్యంగా అభివృద్ధి చెందింది. దేశంలోని ప్రజల జీవన విధానంలో సంభవించిన అనేక మార్పులు, ఆదాయాలు భారీగా పెరిగిపోవడం, ఆహార అభిరు చుల్లో తరచుగా మార్పులు చేసుకోవడం లాంటి ఘటనలు ప్రజలు కొత్త కొత్త రుచులకు అలవాటు పడటానికి, ఫాస్ట్‌ ఫుడ్‌ సెంటర్‌లకు పరుగులు తీయడానికి దోహదపడ్డాయి. దాంతో దేశంలో ఈ ఫాస్ట్ ఫుడ్ పరిశ్రమ మూడు పువ్వులు ఆరు కాయలుగా ముందుకు సాగుతోంది. 
భారతీయులు ఈ మధ్య కాలంలో తరచుగా విదేశాలను సందర్శించడంతో అక్కడి ఆహార అలవాట్లపై మోజు పెంచుకోవడం, జీవన విధానంలో మార్పులు చేసుకోవడం, తీసుకునే ఆహారంలో మార్పులు చేర్పులతో ప్రయోగాలు చేస్తున్నారని నిపుణులు చెపుతున్నారు. స్థానిక ప్రజలు ఫాస్ట్‌ ఫుడ్‌కు అలవాటు పడటంతో కంపెనీలు మంచి లాభాలు గడిస్తున్నాయి. గడిచిన 2008 నుంచి 2010 మధ్య కాలంలో ఫాస్ట్‌ ఫుడ్‌ వినియోగం వార్షిక సగటు 7.8 శాతంగా పెరిగింది. ఇప్పుడిది మరింత పెరిగింది.



ఫాస్ట్‌ ఫుడ్‌ సెంటర్‌లను కొన్ని వైవిధ్యమైన ప్రదేశాలలో స్థాపిస్తున్నారు. ప్రయాణంలో వున్న వారిని కూడా ఆకర్శించటానికి వీలుగా వ్యాపార కూడలల్లో, ఎయిర్‌పోర్టుల్లో, మెట్రో స్టేషన్‌లతో పాటుగా అనేక ప్రదేశాలలో ఈ ఫుడ్‌ సెంటర్‌లను ప్రారంభించారు. దేశంలో ఫాస్ట్‌ ఫుడ్‌ సంస్కృతి పెరిగిపోతున్నాదని చెప్పటానికి ఈ పరిమాణాలే ఉదాహరణ. 
జ‌ర్న‌ల్ ఆఫ్ మార్కెటింగ్ రీసెర్చ్‌లో ప్ర‌చురించ‌బ‌డిన అధ్య‌య‌నం ప్ర‌కారం సైంటిస్టులు కొంద‌రికి 30 సెకండ్ల పాటు ప‌లు కుకీల వాస‌న చూపించారు. దీంతో వారికి ఆ కుకీల‌ను తినాల‌నే ఆస‌క్తి క‌లిగింది. త‌రువాత వారికి 2 నిమిషాల క‌న్నా ఎక్కువ స‌మ‌యం పాటు పిజ్జాలు, స్ట్రాబెర్రీల వాస‌న చూపించారు. దీంతో వారికి పిజ్జాల మీద ఆస‌క్తిపోయింది. క‌డుపు నిండిన భావ‌న క‌లిగింది. దీంతో వారు స్ట్రాబెర్రీల‌ను తినేందుకు ఆస‌క్తి చూపించార‌ట‌. 
అలాగే పిజ్జాలు, యాపిల్స్‌తో మ‌రోసారి టెస్ట్ చేయ‌గా, 2 నిమిషాల అనంతరం వారికి కూడా క‌డుపు నిండిన భావ‌న క‌ల‌గ‌డంతోపాటు వారు కూడా పిజ్జాల‌కు బ‌దులుగా యాపిల్స్‌ను తినేందుకు ఆస‌క్తి చూపించార‌ట‌. దీని వ‌ల్ల సైంటిస్టులు చెబుతున్న‌దేమిటంటే అధికంగా క్యాల‌రీలు ఉన్న ఆహారాల‌ను తినాల‌నే యావ కలిగితే వాటిని తిన‌డం కొంత సేపు ఆపాల‌ని, వాటి వాస‌న 2 నిమిషాల పాటు చూస్తే ఇక ఆ ఆహారాల‌ను తినాల‌నే ఆస‌క్తి పూర్తిగా త‌గ్గిపోతుంద‌ని, దీంతో శ‌రీరంలో అద‌న‌పు క్యాల‌రీలు చేర‌కుండా చూసుకోవ‌డంతోపాటు అధిక బ‌రువు, డ‌యాబెటిస్ వంటి వ్యాధులు రాకుండా జాగ్రత్త ప‌డ‌వ‌చ్చ‌ని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.


కామెంట్‌లు